హైదరాబాద్: జనసేన పార్టీ స్థాపించి మూడేళ్లు పూర్తయిన నేపథ్యంలో.. పార్టీ బలోపేతంపై ఫోకస్ చేశారు అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఇంతకుముందు ప్రకటించినట్లుగానే అనంతపురం నుంచే పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు మొదలుపెట్టనున్నారు. ఈ మేరకు జనసేనకు అండగా నిలబడే మద్దతుదారులకు ఆహ్వానం పలుకుతూ తాజాగా జనసేన నుంచి ఒక ప్రకటన విడుదలైంది.పార్టీ ప్రచార కార్యక్రమాలు, కార్యాచరణను సమర్థవంతంగా విశ్లేషించేవారి కోసం జనసేన అన్వేషిస్తోంది. ఇందుకోసం కంటెంట్ రైటర్స్, అనలిస్ట్, వ్యాఖ్యాతలు కావాలంటూ జనసేన ప్రకటన విడుదల చేసింది. జనసేనలో చేరాలనుకుంటున్నవారు తొలుత వారి సభ్యత్వాన్ని నమోదు చేసుకుని.. ఆపై వ్యాఖ్యాత, కంటెంట్ రైటర్, అనలిస్టు పోస్టులలో ఏదో ఒక ఆప్షన్ ను ఎంచుకోవాల్సి ఉంటుంది.ప్రస్తుతానికి అనంతపురంలోని జనసేన అభిమానులకు మాత్రమే దీన్ని పరిమితం చేయనున్నారు.ఆసక్తిగలవారు www.janasenaparty.org/resourcepersons ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తును నేరుగా పొందేందుకు శ్రీ బాలాజీ రెసిడెన్సీ, 11/129, వినాయక్ చౌక్, సుభాష్ రోడ్, సప్తగిరి సర్కిల్, అనంతపురం-515001. ఈ నెల 28 నుంచి ఏప్రిల్ 4 వరకు పేర్లను రిజిస్టర్ చేసుకోవచ్చు. అనంతపురం జనసేన కార్యకర్తలు, అభిమానులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.