అమెరికాలో పడిపోతున్న విదేశీ విద్యార్థుల దరఖాస్తులు
వాషింగ్టన్: తమ దేశంలో విదేశీయుల ప్రవేశం అంశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరు, నిబంధనల ఫలితంగా ఆ దేశంలోని యూనివర్సిటీల్లో చేరే విదేశీ విద్యార్థుల దరఖాస్తులు తగ్గిపోతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కఠినతరమైన వీసా నిబంధనలతో పాటు అమెరికాలో జాతి విద్వేషపూరిత దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే 250కి పైగా అమెరికన్ కాలేజీల్లో, ఆరు టాప్ అమెరికన్ హయ్యర్ ఎడ్యుకేషన్ గ్రూప్స్ లో భారతీయుల అండర్ గ్రాడ్యుయేట్ దరఖాస్తులు 26 శాతం తగ్గిపో యినట్లు ఓ సర్వేలో తేలింది. కాగా, గ్రాడ్యుయేట్ దరఖాస్తులు కూడా 15 శాతం తగ్గిపోయాయి. మరోవైపు అమెరికాలో విదేశీ విద్యార్థుల అప్లికేషన్లు కూడా సగటున 40 శాతం తగ్గాయి. అమెరికాలో చదివే విదేశీ విద్యార్థుల్లో సగం శాతం మంది విద్యార్థులు చైనా, భారత్ కు చెందిన విద్యార్థులే ఉంటారు. చైనా నుంచి కూడా అండర్ గ్రాడ్యుయేట్ స్టడీస్ దరఖాస్తులు 25 శాతం, గ్రాడ్యుయేట్ స్టడీస్ దరఖాస్తులు 32 శాతం తగ్గిపోయాయి. ఈ ప్రభావం భవిష్యత్తులో కూడా ఉండనుందని సర్వేలో పేర్కొన్నారు.
రెండు సార్లు వైట్ హౌస్ కంచె దాటేందుకు ప్రయత్నించిన మహిళ...అలారం మోగడంతో భద్రతా సిబ్బంది పరుగులు
అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ కంచెపై నుంచి దూకేందుకు ఓ మహిళ మూడు సార్లు ప్రయత్నించడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే...శ్వేత సౌధానికి పక్కనే ఉన్న ట్రెజరీ బిల్డింగ్ వద్ద ఉన్న కంచెపై నుంచి దూకేందుకు అర్ధరాత్రి మార్సి అండర్ సన్ అనే మహిళ ప్రయత్నిస్తుండగా, భద్రతాధికారులు అదుపులోకి తీసుకున్నారు. మార్చి 21న ఆమె తొలిసారి ఇలా వైట్ హౌస్ కంచెదాటుతూ అలారం మోగడంతో పట్టుబడింది. విచారణలో అధ్యక్షుడు ట్రంప్ తో మాట్లాడాలని భావించి కంచె దూకే ప్రయత్నం చేశానని వెల్లడించింది. అప్పట్లో ఆమెను వదిలేశారు. మళ్లీ ఈ నెల 24న మరోసారి అలాగే దూకే ప్రయత్నంలో ఉండగా, భద్రతా సిబ్బంది ఆమెను అదుపులోకి తీసుకున్నారు. తాజాగా గత రాత్ర అమెరికా అధ్యక్ష భవనంలో అలారం మోగడంతో భద్రతా సిబ్బంది ఉరుకులు పరుగులు పెట్టారు. ఈ సారికూడా ఆమె వారికి పట్టుబడింది. దీంతో ఆమెను హెచ్చరించి, ఆమె నుంచి వైట్ హౌస్ కు సంబంధించిన మ్యాప్ ను స్వాధీనం చేసుకున్నారు.
అమెరికా ‘రియల్ హీరో’కు లక్ష డాలర్ల చెక్కును బహూకరించిన ఎన్నారైలు!
అమెరికా రియల్ హీరో ఇయాన్ గ్రిల్లోట్ ను హూస్టన్ లో ఎన్ఆర్ఐలు సత్కరించారు. గత నెలలో కేన్సస్ లో జరిగిన జాత్యహంకార దాడిలో ప్రాణా లకు తెగించి శ్రీనివాస్ కూచిభొట్ల, అలోక్ మాదసానిపై ఆడమ్ పూరింటన్ కాల్పులు జరిపే సమయంలో అతనిని అడ్డుకునేందుకు ఎదురెళ్లి తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఆసుపత్రి నుంచి కోలుకుంటున్న ఇయాన్ గ్రిల్లోట్ ను ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ అమెరికా రియల్ హీరో అంటూ సత్కరించింది. ఈ సందర్భంగా ఆయనకు ఇల్లు కొనుక్కునేందుకు లక్ష డాలర్ల బహుమతిని అందజేసింది. అనంతరం గ్రిల్లోట్ మీడియాతో మాట్లాడుతూ, ’నా తోటి వ్యక్తి కోసం నేను ఏం చేయాలో అదే చేసాను. ఆపదలో ఉన్న వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు, అతని జాతి ఏమిటనేది అప్రస్తుతం. మనందరం మనుషులం. ఆ సమయంలో నేను ఏది సరైనదో అదే పని చేశాను’ అన్నాడు.