ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలోకి టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్, ఎమ్మెల్యే భూమా అఖిలప్రియలు చేరనున్నారు. ఇందుకోసం వచ్చే నెలలో చంద్రబాబు ముహుర్తం నిర్ణయించినట్టు సమాచారం. ఇది వాస్తవ రూపం దాల్చితే వారిద్దరు రికార్డు సృష్టించినట్టే. ఏప్రిల్లో జరిగే ఏపీ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో వీరికి చోటుదక్కనుంది. అదే జరిగితే ఏపీ కేబినెట్లో అత్యంత పిన్నవయసు మంత్రులు వీరే అవుతారు. వీరిలో లోకేశ్ కన్నా అఖిలప్రియ వయసు ఇంకా తక్కువ. అంతేకాదు లోకేశ్ కంటే కూడా ఆమె సీనియర్ కూడా. లోకేశ్ ఇటీవలే ఎమ్మెల్సీగా ఎన్నిక కాగా, అఖిల 2014లో జరిగిన ఉప ఎన్నికలో ఆళ్లగడ్డ నుంచి గెలుపొందారు. తండ్రి నాగిరెడ్డి బతికి ఉన్నప్పుడు రాజకీయ వ్యవహారాలపై అఖిలప్రియ పెద్దగా దృష్టి సారించలేదు. అయితే ఇటీవల తండ్రి ఆకస్మిక మరణంతో తన నియోజకవర్గంతోపాటు తండ్రి నియోజకవర్గమైన నంద్యాలలో కూడా పార్టీ మంచి, చెడులను చూసుకోవాల్సిన భారం ఆమెపై పడింది. దీంతో ఆమె మానసికంగా సిద్ధమయ్యారు. అఖిలప్రియ మానసిక స్థైర్యం చంద్రబాబును సైతం ఆకట్టుకుంది.