ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్రాఫిక్స్‌ చూపించి మభ్యపెడుతున్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 26, 2017, 01:27 AM

విజయవాడ, మేజర్‌న్యూస్‌ : బహుబాలిలో తరహా గ్రాఫి క్స్‌ను కొత్త రాజధాని అమరావతిపై చూపించి ప్రజలను మభ్యపెడుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శిం చారు. ఇంకా ఖరారు కాని డిజైన్లను చూపించడం కోసం శాసన సభా సమావేశాల సమయాన్ని వృథా చేస్తున్నారని ఆరోపించారు. రాజధానికి సంబంధించి ఏవైతే డిజైన్లు చూపిస్తున్నారో వాటికి 51శాతం గ్రీనరీకి ప్రాముఖ్య తనిస్తా అంటున్నారని, మూడు పంటలు పండే భూముల్ని దోచుకుని వాటిని సర్వ నాశనం చేసి ప్లాస్టిక్‌ మొక్కలను మొలిపిస్తానంటున్నారని ఎద్దేవా చేశారు. శాసనసభ సాక్షిగా చంద్రబాబు నాయుడు మరో డ్రామాకు తెర లేపారని రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.  ఏపీ రాజధా నిని సింగపూర్‌లా కడతామంటూ గ్రాఫిక్స్‌ చూపించి ప్రజలను మోసం చేశారని ఆమె  ఆరోపించారు. రాజధానిపై ప్రజలను మభ్యపెట్టిన చంద్రబాబు సింగపూర్‌ డిజైన్లను గాలికొదిలేశారా అని ప్రశ్నించారు. మాకీ సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకుని మరో సంస్థకు మార్చడం వెనుక మతలబు ఏంటో చెప్పాలన్నారు. ఎవరితో చర్చించకుండానే చంద్రబాబు రాజధానిని ఎంపిక చేశారని, ఆనాడు రాజధాని ఎంపిక విషయంలో ప్రతిపక్షాన్ని, అఖిలపక్షాన్ని ఎందుకు పిలవలేదని రోజా సూటిగా ప్రశ్నించారు. రాజధానిలో డిజైన్లలో 51 శాతం గ్రీనరీకి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పుకునే చంద్రబాబు మూడు పంటలు పండే 33వేల ఎకకాల భూమిని లాక్కుని ఎక్కడ నుంచో తెచ్చి చెట్లు పెడతానని  చెవిలో కాలీఫ్లవర్లు పెడుతున్నారని రోజా ఎద్దేవా చేశారు. ప్రస్తుత రాజధానిలో చూసేందుకు ఓ చెట్టుకూడా లేదని అన్నారు. ఇక మహిళా మంత్రులు, ప్రతినిధులు వెళ్లేందుకు టాయిలెట్లు కూడా లేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నామని ఆమె పేర్కొన్నారు.  మొదట సింగపూర్‌ డిజైన్లు, తర్వాత పొగ గొట్టాల డిజైన్లను తెర మీదకు తెచ్చారని, తాజాగా ఫోస్టర్‌ సంస్థ డిజైన్లపై ప్రజంటేషన్‌ ఇస్తున్నారని ఎమ్మెల్యే రోజా అన్నారు. ఆ రెండు గ్రాఫిక్‌లను పక్కనపెట్టి ఇప్పుడు మూడో గ్రాఫిక్‌ను తెచ్చారని, దాన్ని కూడా ఖరారు చేస్తారో లేదో తెలియదన్నారు. రైతుల సమస్యలపై చర్చించాలని తాము కోరితే, గ్రాఫిక్‌ డిజైన్ల పేరుతో సభా సమయాన్ని వృధా చేస్తున్నారన్నారు. ప్రజలకు చూపించాల్సింది బొమ్మలు కాదనీ, భవిష్యత్‌ తరాలకు ఉపయోగపడే రాజధాని కావాలన్నారు. శాశ్వత రాజధాని డిజైన్లను సభలో ప్రదర్శించాలని రోజా డిమాండ్‌ చేశారు. గొప్పలు చెప్పుకుంటూ డిజైన్ల పేరుతో కాలయాపన చేస్తున్న ప్రభుత్వ వైఖరికి నిరసనగానే, పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌కు వైసీపీ హాజరు కాలేదని ఆమె తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com