ధర్మశాల : ఇక్కడ జరుగనున్న నాలుగో టెస్టు కోసం తొలిరోజు ముమ్మరంగా ప్రాక్టీస్ చేసిన స్టీవ్స్మిత్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు శుక్రవారం నాడు ఆధ్మాతిక బాటలో నడిచింది. కోహ్లీసేనతో అమీతుమీ తేల్చుకోవాల్సిన నాలుగో టెస్టుకు ఒకరోజు ముందు ధర్మశాలలోనే ఉంటున్న ప్రముఖ బౌద్ధమత గురువు దలైలామా ఆశ్రమం సందర్శించింది. లామాతో సంభాషించిన కంగారు క్రికెటర్లు ఆయన ఆశీర్వాదాలు పొందారు. ఈసందర్భంగా మాట్లాడిన స్టీవ్ స్మిత్ ‘‘ప్రపంచ ప్రఖ్యాతి పొందిన దలైలామాను కలవడం సంతోషంగా ఉంది. అత్యంత ఒత్తిడికి గురిచేస్తున్న నాలుగో టెస్టు సమయంలో ప్రశాంతంగా ఎలా నిద్రపోవాలో ఆయనను అడిగి తెలుసుకున్నా. చాలా సంతోషంగా ఉంది. నిద్ర గురించి అడిగాను. నేను ప్రశాంతంగా నిద్రపోయేందుకు ఏమైనా సాయం చేయగలరా అని ప్రశ్నించాను. ఆశీస్సులు కోరాను. మేమిద్దరం మా ముక్కులు రాసుకొన్నాం. ఆయన నాకు ఆశీస్సులు అందించారు. ఈ ఐదు రోజులు ప్రశాంతంగా నిద్ర పడుతుందని ఆశిస్తున్నా’’ అని స్మిత్ అన్నాడు. 2013లో ఇంగ్లాండ్ జట్టు కూడా ఈ ఆశ్రమాన్ని సందర్శించినా దలైలామాను మాత్రం కలవలేకపోయారు.