ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మా ప్రభుత్వం వస్తే వీఆర్‌ఏలకు 15 వేల జీతం ఇస్తాం : జగన్‌ హామీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 25, 2017, 02:13 AM

విజయవాడ, మేజర్‌న్యూస్‌ : తమ ప్రభుత్వం వస్తే వీఆర్‌ఏలకు రూ.15వేల జీతం ఇస్తామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది ఎటూ ఎన్నికల సంవత్సరమేనని, ఆ తర్వాత మనందరి ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన వారం రోజుల్లోనే వీఆర్‌ఏలకు రూ. 15 వేల వేతనం కచ్చితంగా ఇస్తానని జగన్‌ భరోసా ఇచ్చారు. శుక్రవారంనాడు వీఆర్‌ఏల నిరసనసభకు వెళ్లి ఏపీ ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి తన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ పక్క రాష్టమ్రైన తెలంగాణలో వీఆర్‌ఏలకు రూ. 10,700 వేతనం ఇస్తుంటే ఏపీలో మాత్రం చాలీచాలని జీతాలు ఇస్తున్నారని విమర్శించారు. దీనిపై మూడేళ్లుగా పోరాడుతున్నా సీఎం చంద్రబాబు మాత్రం ఎవ్వరి మాటలు వినిపించుకోవడం లేదన్నారు. ఆయన చర్మం మందమెక్కి పోయిందని జగన్‌ మండిపడ్డారు. మనం ఏం చెప్పినా ఆయన చెవిలోకి ఎక్కించుకునే పరిస్థితిలో లేదన్నారు. ఈ ఏడాది, ఏడాదిన్నర కూడా గట్టిగా ప్రయత్నిద్దామని, అయినా చంద్రబాబుతో పనిచేయించుకోలేకపోతే వచ్చే ఎన్నికల తర్వాత వచ్చే మనందరి ప్రభుత్వంలో కచ్చితంగా వీఆర్‌ఏలకు రూ. 15,000 జీతం ఇప్పిస్తానని తెలిపారు. వీఆర్‌ఏల సంఘం నాయకులతో పాటు సీపీఎం నేత బాబూరావును కూడా పిలిపించుకుని మీ అందరి ముఖాల్లో చిరునవ్వులు చూస్తానన్నారు. ఎవ్వరూ అధైర్యపడద్దని భరోసా ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com