విజయవాడ,సూర్యప్రతినిధి: విజయవాడ నగరాన్ని మెట్రోపాలిటన్ ప్రాంతంగా గుర్తిస్తూ రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీచేసింది. మెట్రో రైలు ప్రాజెక్టు రావాలంటే ఆ నగరానికి మెట్రో హోదా తప్పనిసరి. ఈ దృష్ట్యా నగరపాలక సంస్థ పాలక మండలి విజయవాడతో పాటు శివారు ప్రాంతాల్ని కలుపుతూ మెట్రో నగరంగా మారుస్తూ గతంలోనే తీర్మానం చేసింది. ఆ తీర్మానానికి కొనసాగింపుగా శుక్రవారం పట్టణాభివృద్ధి శాఖ ఈ ప్రాంతాన్ని మెట్రోపాలిటన్ గా గుర్తిస్తూ 104జీవో జారీచేసింది. పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి కరికాల వలవన్ ఈ మేరకు ఆదేశాలిచ్చారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కూడా త్వరలో విజయవాడను మెట్రోపాలిటన్ గా నోటిఫై చేయాల్సి ఉంది. ఆ ప్రక్రియ పూర్తయితే అమరావతి మెట్రో రైలు ప్రాజెక్టు పనులు ప్రారంభించేందుకు అవకాశం ఏర్పడుతుంది. తాజా ఉత్తర్వులతో మెట్రో రైలు పనులకు మార్గం సుగమం అయిందని అమరావతి మెట్రో రైలు కార్పొరేష్ ఎండీ రామకృష్ణారెడ్డి తెలిపారు.