విజయవాడ మేజర్న్యూస్ : ఆంధ్రప్రదేశ్లో అరాచకం రాజ్యమేలుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా అధికారపక్ష సభ్యులు వై.ఎస్.జగన్పై వ్యక్తిగత దూషణలు చేస్తూ సభను అడ్డుకుంటున్నారని ఆమె అన్నారు. ప్రత్యేక హోదా, కరువు, అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల సహా ఏ ఒక్క అంశాన్ని ప్రభుత్వం చర్చకు అనుమతించలేదని రోజా ఈ సందర్భంగా గుర్తు చేశారు. చర్చ జరిగితే తన బాగోతం బయటపడుతుందనే భయం అధికార పక్షానికి పట్టుకుందన్నారు. అందుకే ప్రతిసారి అధికారపక్ష సభ్యులు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారన్నారు. ఓటుకు కోట్లు కేసు ఛార్జిషీటులో ముఖ్యమంత్రి చంద్రబాబు పేరు ప్రస్తావన, సుప్రీంకోర్టు నోటీసులపై చర్చించాలంటూ తాము వాయిదా తీర్మానం ఇస్తే దానిపై చర్చించకుండా అదో పనికిమాలిన కేసు అని, దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని ఒకరు, పక్క రాష్ట్రంలో జరిగినదాన్ని తీసుకు వచ్చిన ఏపీ అసెంబ్లీలో ఎలా మాట్లాడతారు అని మరొకరు మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే రోజా అన్నారు. స్పీకర్ తమకు తండ్రిలాంటివారని, ఆయనపై తమకు గౌరవం ఉందన్నారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు నాయుడు అడ్డంగా బుక్కయ్యారని, ఆడియో, వీడియో టేపుల్లో ఆయన దొరికిపోయారన్నారు. బ్రీఫ్డ్ మి అన్న వాయిస్ చంద్రబాబుదే అని ఫోరెన్సిక్ పరీక్షల్లో తేలిందని, చంద్రబాబు డబ్బులిచ్చారని రేవంత్రెడ్డి స్వయంగా చెప్పారని రోజా పేర్కొన్నారు. అగ్రిగోల్డ్ అంశంలో ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విసిరిన సవాల్కు వైసీపీ సిద్ధమని చెప్పారు. అయితే సవాల్ స్వీకరించేందుకు కొన్ని కండిషన్లు పెట్టిందని ప్రత్తిపాటి నిజాయితీ తమకంటే టీడీపీ వాళ్లకే ఎక్కువ తెలుసునని రోజా అన్నారు. ఓటుకునోటు కేసు విచారణకు సిద్ధం కావాలని, టీడీపీ తప్పు చేయలేదని నిరూపిస్తే ఏం చెబితే అది వైసీపీ వింటుందని, లేకపోతే బాబు కుటుంబం మొత్తం రాజకీయ సన్యాసం చేస్తారా అంటూ రోజా సవాల్ విసిరారు. పుల్లారావుకి, జగన్కు లింక్ పెడితే నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉందని ఆమె అన్నారు.