తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న శ్రీనివాస మంగాపురం లోని శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో శుక్ర వారం సాయంత్రం పుష్పయా గం వైభవంగా జరిగింది. ఇటీవల శ్రీ కల్యాణ వేంకటే శ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. నిత్యకైంకర్యాల్లో గానీ, బ్రహ్మోత్సవాల్లో గానీ, అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటిని నివౄఎత్తి చేసుకునేందుకు పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఉదయం 10.00 నుండి 11.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వర స్వామివారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేశారు.
మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 5.00 గంటల వరకు అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ పుష్పయాగం వైభవంగా జరిగింది. తులసి, చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, రోజా, కలువలు వంటి 12 రకాల పూలు, ఆరు రకాల ఆకులు కలిపి మొత్తం ఐదు టన్నుల పుష్పాలతో స్వామి, అమ్మవార్లకు యాగం నిర్వహిం చారు. వీటిలో తమిళనాడు నుంచి రెండు టన్నులు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక టన్ను, కర్ణాటక నుంచి ఒక టన్ను పుష్పాలు విరాళంగా అందాయి. ఆద్యంతం శోభాయమానంగా సాగిన ఈ పుష్పయాగ మహోత్సవాన్ని చూసి భక్తులు తన్మయత్వం చెందారు. మొత్తం వెయ్యి మందికి పైగా భక్తులు ఈ యాగంలో పాల్గొన్నారు. కాగా రాత్ర 7.00 గంటలకు వీధి ఉత్సవం జరుగనున్నాయి. ఈ కార్యక్రమంలో టిటిడి కార్యనిర్వహణాధికారి డా డి.సాంబశివరావు దంపతులు, స్థానిక ఆలయాల ఉప కార్యనిర్వహణాధికారి శ్రీ పి.వెంకటయ్య, గార్డెన్ సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాసులు, ఏఈవో శ్రీ డి.ధనంజయ, అర్చకులు, ఇతర అధికార ప్రముఖులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.