-నాలుగో వంతు తగ్గిన లైసెన్సు రుసుం
-నేడు గెజిట్ విడుదల చేయనున్న ఎెక్సైజ్ శాఖ
-అంతర్జాలంలో దరఖాస్తుల స్వీకరణకు సిద్ధం
విజయవాడ, సూర్య బ్యూరో : కష్ణా జిల్లాలో విజయవాడ, మచిలీపట్నం ఎక్సైజ్ సూపరింటెండెంట్ల పరిధిలో మద్యం దుకాణాల లైసెన్సుల వేలానికి రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించిన గెజిట్ను శుక్రవారం విడుదల చేయనున్నట్టు అధికారిక సమాచారం.
సుప్రీం కోర్టు తీర్పు నేపధ్యంలో నూతన విధానం రూపొందిం చారు. రహదా రులకు ఆనుకుని ఉన్న దుకాణాలను 500 మీటర్లకు దూరంగా తరలించాల్సిన పరిస్థితి రావటంలో మూడు నెలలు ముందుగానే ఈ ప్రక్రియ మొదలైంది. రద్దీ ప్రాంతాల నుంచి తమ దుకాణాలను తరలించటం వల్ల వ్యాపారం సాగదని లైసెన్సులను వదిలేయడానికి ఆయా దుకాణదారులు సిద్ధపడ్డారు. ఈ కారణంగా మొత్తం దుకాణాలన్నింటికీ కొత్త విధానంలో ముందస్తుగా వేలం నిర్వహించనున్నారు. గతంతో పోల్చిచూసుకుంటే లైసెన్సు రుసుం నాలుగో వంతు తగ్గింది. జనాభా సంఖ్యను బట్టి లైసెన్సు రుసుం నిర్ణయించారు. 5 వేల జనాభా ఉన్న ప్రాంతాలకు రూ.7.5 లక్షలు, 5-10 వేల జనాభా ఉంటే రూ.8.5 లక్షలు, 10-25 వేల జనాభా ప్రాంతాలకు రూ.9.25 లక్షలు, 25-50 వేల జనాభా ఉన్న ప్రాంతాలకు రూ.10 లక్షలు, 50 వేల నుంచి 3 లక్షల జనాభా ప్రాంతాలకు రూ.11.25 లక్షలు, 3 నుంచి 5 లక్షల జనాభా ప్రాంతాలకు రూ.12.5 లక్షలు, ఐదు లక్షలు పైబడిన ప్రాంతాలకు రూ.16.25 లక్షల లైసెన్సు రుసుం నిర్ణయించారు.
అంతర్జాలంలోనే దరఖాస్తు చేసుకునే విధానాన్ని రూపొందించారు. ఈ నెల 24 నుంచి 30 తేది వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 31న దరఖాస్తు చేసుకున్న వారిని లాటరీ పద్ధతిలో దుకాణాలను కేటాయిస్తారు.