న్యూఢిల్లీ: తాము అందించే అన్ని పథకాలకూ ఆధార్ కార్డును అనుసంధానం చేస్తూ ముందుకు వెళుతున్న కేంద్ర ప్రభుత్వం ఇక పాన్ కార్డుకి కూడా ఆధార్ కార్డును అనుసంధానం చేయాల్సిందేన్ని చెప్పింది. ఈ ఏడాది చివరిలోపు ఈ పని చేయకుంటే వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ తర్వాత మీ పాన్ కార్డు ఇక చెల్లుబాటు కాదని పేర్కొంది. ప్రస్తుతం ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేసేవారందరికీ తప్పనిసరిగా పాన్ కార్డు ఉండాలన్న నిబంధన ఉన్న విషయం తెలిసిందే.
అయితే, పన్ను రిటర్నులే కాకుండా గుర్తింపు కార్డుగా కూడా పాన్ కార్డు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఎంతో మంది పాన్ కార్డులు తీసుకుంటున్నారు. అదే పెద్ద తలనొప్పిగా మారుతోంది. పాన్ కార్డుల్లో చాలావరకు నకిలీ కార్డులు ఉన్నాయని అనుమానాలు వ్యక్తమవుతుండటం పాటు ఒక్కరే రెండేసి పాన్ కార్డులు తీసుకున్న సందర్భాలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో వాటిలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలో వయోజనుల్లో 98 శాతం మందికి ఆధార్ కార్డులు ఉన్నాయని కేంద్రం తెలిపింది. అలాగే దేశంలో మొత్తం 108 కోట్ల మందికి ఆధార్ కార్డులున్నాయని పేర్కొంది.