ఢిల్లీ: ఆదాయ వివరాలు వెల్లడించకుండా నల్లధనం కలిగి ఉన్న వారికి ఆదాయపు పన్ను శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకం(పీఎంజీకేవై) మార్చి 31తో ముగియనుంది. దీంతో బ్లాక్మనీ ఉన్న వారు తమ ఆదాయ వివరాలను వెల్లడించాలని లేదంటే కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ప్రధాన జాతీయ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు. ‘ఆదాయపు పన్నుశాఖ అధికారుల దగ్గర మీ డిపాజిట్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి. ఈ పథకం కింద మీరు వెల్లడించే ఆస్తుల వివరాలను గోప్యంగా ఉంచుతాం’ అంటూ ప్రకటన జారీ చేశారు.అక్రమంగా డబ్బు దాచిన వ్యక్తులు, పన్ను ఎగవేతదారుల వివరాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సీబీఐకి అందించనున్నారు. నల్లధనాన్ని దాయాలని ప్రయత్నించిన వారిని అధికారులు పట్టుకున్నపుడు కూడా ఆ డబ్బును అప్పగించకపోతే అధికంగా 137శాతం వరకూ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. పీఎంజేకేవై కింద అధికారులు సోదాలు జరిపినపుడు బయటపడిన లెక్కల్లో చూపని ఆదాయంపై 83.25శాతం పన్ను కట్టాల్సి ఉంటుంది. సోదాలు నిర్వహించినపుడు అక్రమ ఆదాయం బయట పడితే 107.25శాతం పన్ను, జరిమానా కట్టాల్సి వస్తుంది.