-అజమారుుషీకి అంతం పలికి అభివృద్ధిపై దృష్టి సారించాలి
-ముగ్గురు వీరులు అసమాన త్యాగంతో అమరులైన దినమిది
-ముస్లిం విద్యార్థినికి అండగా నిలిచిన మోడీ
-ప్రధానికి రుణపడి ఉంటామన్న విద్యార్థి తల్లిదండ్రులు
న్యూఢిల్లీ: ప్రభుత్వ అధికారులపై అజమాయిషీకి అంతం పలికి అభివృద్ధిపై దృష్టి సారించాలని ఉత్తరప్రదేశ్ ఎంపీలకు ప్రధాని నరేంద్రమోడీ హితబోద చేశారు. ప్రతి ఎంపీ తమ తమ నియోజకవర్గ అభివృద్ధికోసం పనిచేయాలని చెప్పారు. ఈ మేరకు ఆయన గురువారం యూపీ ఎంపీలతో తన అధికారిక నివాసం కల్యాణ్ మార్గలో సమావేశం అయిన సందర్భంగా సూచించారు. ఈ సమావేశానికి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా హాజరయ్యారు. ప్రభుత్వ అధికారుల బదిలీలు, మార్పులు చేర్పులు, నియామకాల అంశాల నుంచి దృష్టిని మరల్చాలని మాకు ప్రధాని మోడీ సూచించారు. అభివృద్ధిపై దృష్టి పెట్టాలని చెప్పారు అని పేరు చెప్పేందుకు ఇష్టపడని యూపీకి చెందిన ఓ ఎంపీ రహస్యంగా ఈ విషయం మీడియాకు చెప్పారు. సుపరిపాలనే అభివృద్ధికి మంత్రం అని, దానిపై తప్ప మరే ఇతర అంశాలపైనా దృష్టిసారించరాదని మోడీ చెప్పినట్లు కూడా ఆయన వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ను పూర్తి స్థాయిలో అభివృద్ధిలోకి తీసుకొస్తామని ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అభివృద్ధి జపంతోనే బీజేపీ యూపీ సీఎం పీఠాన్ని హస్తగతం చేసుకున్నందున తాజాగా ఎంపీలతో భేటీ అయ్యి అభివృద్ధికి సంబంధించిన సూచనలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. సరిగ్గా 86 సంవత్సరాల క్రితం ఇదే రోజు... అంటే 1931 మార్చి 23న స్వాతంత్య్ర సమరయోధుల త్రయం భగత్ సింగ్, శివారామ్ హరి రాజ్ గురు, సుఖ్ దేవ్ థాపర్ లను బ్రిటీష్ పాలకులు ఉరి వేసిన రోజు. వారి త్యాగాలను ప్రధాని నరేంద్ర మోడీ స్మరించుకున్నారు. వారి అసమాన ధైర్య సాహసాలను, త్యాగాన్నీ భారతావని ఎన్నడూ మరచిపోదని కొనియాడారు. కాగా, ప్రస్తుతం పాకిస్థాన్ పరిధిలో ఉన్న పంజాబ్ ప్రావిన్స్ లో 1907లో జన్మించిన భగత్ సింగ్ ను లాహోర్ జైల్లో ఉరితీసిన సంగతి తెలిసిందే. ఆయనను ఉరితీసిన నాటికి భగత్ సింగ్ వయసు కేవలం 23 సంవత్సరాలు మాత్రమే! ప్రధాని నరేంద్ర మోడీ స్పందన ఓ ముస్లిం విద్యార్థిని జీవితానికి బంగారు బాటలు వేసింది. వివరాల్లోకి వెళ్తే, కర్ణాటకలోని మండ్యా జిల్లా షుగర్ టౌన్ ప్రాంతానికి చెందిన బీబీ సారా (21) అనే విద్యార్థిని ఉన్నత చదువులకు ఆమె కుటుంబ ఆర్థిక పరిస్థితి అడ్డంి గా మారింది. ఎంబీఏ చేయడానికి ఎడ్యుకేషన్ లోన్ కోసం అన్ని బ్యాంకుల చుట్టూ ఆమె తిరిగింది. కానీ, ఆమెకు లోన్ ఇవ్వడానికి ఒక్క బ్యాంకు కూడా ముందుకు రాలేదు. దీంతో, తనకు విద్యా రుణం ఇప్పించాలంటూ ప్రధాని మోదీకి లేఖ రాసింది. పది రోజుల తర్వాత ఆమెకు ప్రధాని నుంచి సమాధానం వచ్చింది. అంతేకాదు, ఆమెకు వెంటనే విద్యా రుణం ఇప్పించాలంటూ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ప్రధాని నుంచి ఆదేశాలు అందాయి.దీంతో, ఆమెకు ఆగమేఘాల మీద రుణం మంజూరయింది. విజయాబ్యాంకు ఆమెకు రూ. 1.5 లక్షల విద్యా రుణం మంజూరు చేసింది. ఈ సందర్భంగా సారా మాట్లాడుతూ, ప్రధాని తన సమస్య పట్ల స్పందిస్తారనే తాను భావించానని... అయితే, ఇంత తొందరగా స్పందిస్తారని అనుకోలేదని సంతోషం వ్యక్తం చేసింది. ఆమె తండ్రి మాట్లాడుతూ, తన కుమార్తె చదువుకు సాయం చేసిన ప్రధానికి రుణపడి ఉంటామని చెప్పారు.