ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరువు నివారణకు ప్రత్యేక ప్రణాళిక

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 24, 2017, 12:59 AM

   విజయవాడ, మేజర్‌న్యూస్‌: రాయలసీమ నాలుగు జిల్లాలతో పాటు  ప్రకాశం జిల్లాలోని కరువు పరిస్థితులను అధిగమించి రూ.1,100 కోట్లతో ఆంధ్రప్రదేశ్‌ కరువు ఉపశమన ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టనుందని రాష్ర్ట హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. రాష్ర్టంలోని కరువు పరిస్థితులపై గురువారం శాసనమండలిలో జరిగిన స్వల్ప వ్యవధి చర్చకు ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సమాధానమిచ్చారు. ‘‘వ్యవసాయ అభివృద్ధి కోసం అంతర్జాతీయ నిధులు’’ పేరిట విదేశీ నిధుల కోసం  పలు సంస్ధలను సంప్రదిం చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ కరువు ప్రాజెక్టును 2017లో ప్రారంభించి వచ్చే అయిదు సంవత్సరాలపాటు కొనసాగుతుందన్నారు. ఆయా జిల్లాల కలెక్టర్లు ఇచ్చిన నివేదిక ప్రకారం ఎనిమిది జిల్లాలోని 301 మండలాలు ఉన్నాయని ఆయన చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో 15, ప్రకాశం జిల్లాలో 56, నెల్లూరు జిల్లాలో 27, చిత్తూరు జిల్లాలో 66, కడప జిల్లాలో 32, అనంతపురం జిల్లాలో 63, కర్నూలుజిల్లాలో 36, విజయనగరం జిల్లాలో 06, మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వం గుర్తించిందని ఆయన వివరించారు.ఈ మండలాల్లో కరువు సహాయక చర్యలు చేపట్టేందుకు జాతీయ విపత్తు సహాయ నిధి నుంచి రూ.2281 కోట్లు, రాష్ర్ట ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ.3173 కోట్ల నిధుల విడుదల కోసం గత డిసెంబర్‌ లో కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖకు  నివేదిక అందజేశామని చినరాజప్ప తెలియజేశారు. 


    రాష్ర్ట ప్రభుత్వ నివేదికననుసరించి కరువు పరిస్ధితులను అధ్యయనం చేసేందుకు  కేంద్ర బృందం ఈ ఏడాది జనవరిలో రాష్ర్టంలో పర్యటిం చిందన్నారు. కేంద్ర బృందం ఇచ్చిన నివేదిక ప్రకారం త్వరలోనే  కేంద్రం నుండి త్వరలోనే కరువు సహాయక నిధులు మంజూరు అవుతాయన్న ఆశాభావంతో ఉన్నామని చినరాజప్ప  వెల్లడించారు. 


  కరువు మండలాల్లో మంచి నీటి సమస్యను ఎదుర్కొనేందుకు రూ. 132 కోట్లతో ప్రత్యేక ప్రణాళికను రూపొందించినట్లు ఉప ముఖ్యమంత్రి మండలి సభ్యులకు తెలిపారు. అందులో భాగంగా తొలిదశలో రాష్ర్ట విపత్తు స్పందన నిధి నుండి రూ.73 కోట్లను విడుదల చేశామని చినరాజప్ప తెలియజేశారు. అలాగే 31 కరువు ప్రభావిత నగరాల్లో కూడా మంచినీటి సమస్యను అధిగమిం చేందుకుగాను  రూ. 141.73 కోట్ల నిధుల విడుదల కోసం ప్రభుత్వానికి ఆయా పురపాలక సంఘాలు నివేదికలు అందజేశాయని చినరాజప్ప పేర్కొన్నారు. ఆ నివేదికల ప్రకారం ఈ ఏడాది వేసవిలో మంచినీటి సమస్యను ఎదుర్కొనేందుకు తొలివిడతగా రాష్ర్ట విపత్తు సహాయ నిధి నుండి రూ.25 కోట్లను విడుదల చేశామన్నారు. గ్రామీణ ఉపాధి కింద రూ.976.68 కోట్ల తో 302 లక్షల పనిదినాలు కల్పించనున్నట్లు చినరాజప్ప తెలిపారు. 


   దాదాపు 5 లక్షల కుటుంబాలకు గ్రామీణ ఉపాధి ద్వారా లబ్ధి చేకూరు తుందన్నారు. కరువు మండలాల్లో   ఈ ఏడాది జనవరి నుండి మే వరకు పశుగ్రాసం సరఫరా కోసం రూ. 182.80 కోట్లతో కార్యచరణ ప్రణాళిక రూపకల్పన జరిగిందని ఆయన చెప్పారు. అందులో భాగంగా రూ.23.78 కోట్లను విడుదలచేశామని చినరాజప్ప తెలియజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com