విజయవాడ: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. సీఎం చంద్రబాబు అద్భుతంగా కొనుగోలు చేశారని వ్యాఖ్యానించారు. కొనుగోలు పథకంలో చంద్రబాబు ఆరితేరి పోయారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రిగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వ్యక్తే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొనుగోళ్లకు పాల్పడ్డారని ఆరోపించారు. డబ్బుతో గెలిచిన గెలుపు ఓ గెలుపేనా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. గతంలో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేలను కొంటూ చంద్రబాబు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు కూడా అదేవిధంగా వ్యవహరించారన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ ప్రలోభాలకు దిగడంతో టీడీపీ అభ్యర్థులు అతికష్టం మీద గెలిచారు. అధికార పార్టీ ఎన్ని కుయుక్తులు పన్నినా వైఎస్సార్ సీపీ గట్టిపోటీ ఇచ్చింది. అధికారికంగా టీడీపీ గెలిచినా నైతిక విజయం తమదేనని వైఎస్సార్ సీపీ పేర్కొంది.