న్యూఢిల్లీ: భారత్ లో అతి పెద్ద టెలికాం విలీనం ప్రకటన వచ్చింది. ఐడియా లో వొడాఫోన్ విలీనానికి ఐడియా బోర్టు ఆమోదం తెలిపింది. ఐడియా, వొడాఫోన్ ఇండియాలో అతిపెద్ద టెలికాం ఆపరేటర్గా అవతరించాయి. దీంతో ప్రస్తుతం రెండు సంస్థల మొత్తం కస్టమర్ల సంఖ్య 40 కోట్లకు చేరింది. అంటే దేశంలో ప్రతి ముగ్గురిలో ఒకరు ఈ సంస్థలకు చెందినవారే. దేశంలో అతిపెద్ద నెట్వర్క్ తమదేనని ఈ సంస్థలు ఒక ప్రకటనలో వెల్లడించాయి. రిలయెన్స్ జియో, భారతీ ఎయిర్టెల్లకు ఇప్పుడీ సంస్థలు దీటుగా నిలుస్తాయని నిపుణులు చెబుతున్నారు. వచ్చే ఏడాది కల్లా ఈ విలీనం పూర్తవుతుందని భావిస్తున్నారు. ఈ విలీనం వల్ల కేంద్ర ప్రభుత్వ డిజిటల్ ఇండియా విజన్ సాకారం చేయడానికి ఆదిత్య బిర్లా గ్రూప్ తనవంతు పాత్ర పోషించనుందని గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా అన్నారు. ఈ విలీనం తర్వాత సంస్థలో వొడాఫోన్ వాటా 45.1 శాతం. అందులో 4.9 శాతాన్ని(రూ.3874 కోట్లు) వొడాఫోన్ ఐడియా ప్రమోటర్లు, దాని అనుబంధ సంస్థలకు ట్రాన్స్ఫర్ చేస్తుందని ఐడియా ప్రకటించింది. ఐడియా వాటా 26 శాతంగా ఉంటుంది. అయితే భవిష్యత్తులో వొడాఫోన్ షేర్లను కొనుగోలు చేసి సమాన వాటా పొందే హక్కు ఐడియాకు ఉంటుంది. ఐడియా ప్రమోటర్లకే ఈ కొత్త సంస్థ చైర్మన్ను ఎంపిక చేసే హక్కు ఉంటుంది. ఈ విలీనాన్ని భారత టెలికాం సెక్టార్కి, ఆ సంస్థలకి శుభసూచకంగానే నిపుణులు భావిస్తున్నారు. ఈ విలీన ప్రకటన రాగానే ఐడియా షేర్లు ఏకంగా 14 శాతం పెరగడం విశేషం.