లఖ్నవూ: ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరనే దానిపైపై ఉత్కంఠకు తెరపడింది. ఈ సాయంత్రం భేటీ అయిన భాజపా శాసనసభాపక్షం తమ నేతగా 44 ఏళ్ల యోగి ఆదిత్యనాథ్ను ఎన్నుకుంది. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే పెద్ద అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే అక్కడ కొత్త ప్రభుత్వాన్ని కొలువుదీర్చేందుకు కొన్ని రోజులుగా తీవ్ర కసరత్తు చేసిన ఆ పార్టీ అగ్రనేతలు చివరకు శనివారం ఈ సస్పెన్షన్కు తెరదించారు. రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ఎన్నికైనట్టు వెల్లడించారు. సమావేశం జరుగుతున్న వేదిక వద్ద ఆదిత్యనాథ్ మద్దతుదారులు ‘యోగి యోగి’ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు.ఎన్నికల ఫలితాలు వెల్లడైనప్పటి నుంచీ ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠంపై భాజపా ఎవర్ని కూర్చోబెడుతుందనే దానిపై దేశవ్యాప్తంగా చర్చజరిగింది. యూపీ ముఖ్యమంత్రి పదవికి కేంద్ర మంత్రులు మనోజ్ సిన్హా, రాజ్నాథ్సింగ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కేశవ్ప్రసాద్ మౌర్య పేర్లు పేర్లు ప్రముఖంగా విన్పించినప్పటికీ.. అనూహ్య మలుపుల మధ్య చివరకు యోగి ఆదిత్యనాథ్ను ఎంపికచేయడం గమనార్హం. యోగి ఆదిత్యనాథ్ గోరఖ్పూర్ నుంచి ఆరు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. అంతేకాకుండా ఆయన హిందూ యువ వాహిని వ్యవస్థాపకుడు కూడా.