రాష్ట్రవ్యాప్తంగా ఐదేళ్లలోపు చిన్నారులకు ఫిబ్రవరి మూడో తేదీన పోలియో చుక్కలు వేయనున్నారు. ఒకే విడతలో జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా 51,66,690 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకుగాను 37,493 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం కోసం 1,49,977 మందికి శిక్షణ ఇచ్చినట్లు తెలిపింది. రైల్వేస్టేషన్లు, బస్సుస్టేషన్లు, ఇతర ముఖ్య ప్రాంతాల్లోనూ పోలియో చుక్కల కేంద్రాలు అందుబాటులో ఉంటాయి. అప్పుడే పుట్టిన శిశువులు సహా సాధారణ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పిల్లలకు కూడా ఈ చుక్కలు వేయించవచ్చని పేర్కొంది.