ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో కీలక నేత నామినేషన్ తిరస్కరణ.. ఆ చిన్న కారణంతోనే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 27, 2024, 09:09 PM

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కడప ఎంపీ స్థానానికి దాఖలు చేసిన నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. ఈ స్థానానికి మొత్తం 32 మంది నామినేషన్లు వేయగా.. వాటిలో ప్రధాన పార్టీల అభ్యర్థులతో సహా 18 మంది నామినేషన్లను ఆమోదించారు. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన శివశంకర్‌రెడ్డి ప్రమాణ పత్రం దాఖలు చేయాల్సి ఉంది. ఆర్వో ఎదుట దాన్ని చదవాల్సి ఉంటుంది. వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న శివశంకర్‌రెడ్డి ఇటీవల బెయిల్‌పై విడుదలై న్యాయస్థానం ఆదేశాల మేరకు హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఈ నెల 18న అతడి తరఫున విద్యాధర్‌రెడ్డి అనే వ్యక్తి నామినేషన్‌ వేశారు. పరిశీలనలో ప్రమాణపత్రం లేనట్లు గుర్తించిన ఆర్వో.. ఆ నామినేషన్‌ను తిరస్కరించారు.


మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం ముగిసింది. వైఎస్సార్‌సీపీ, టీడీపీ అభ్యర్థులు దాఖలుచేసిన అఫిడవిట్లు, నామినేషన్‌ పత్రాలపై కొన్ని అభ్యంతరాలు వచ్చాయి. బాపట్ల జిల్లా చీరాల కాంగ్రెస్‌ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్‌ నామినేషన్‌ పత్రంపై నిర్ణయాన్ని రిటర్నింగ్‌ అధికారి జి.సూర్యనారాయణరెడ్డి పెండింగ్‌లో పెట్టారు. కృష్ణమోహన్‌ రూ.4.63 కోట్ల మేర విద్యుత్తు బకాయిలు చెల్లించాలని ఆర్వోకు ఫిర్యాదు అందడంతో దాన్ని ఆమోదించకుండా పెండింగ్‌లో ఉంచారు. శనివారం ఉదయానికల్లా విద్యుత్తు బిల్లుల చెల్లింపుల పూర్తి వివరాలు, పత్రాలు సమర్పించాలని ఆమంచిని ఆర్వో ఆదేశించారు.


పెందుర్తి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌.. అఫిడవిట్‌లో క్రిమినల్‌ కేసుల జాబితాలో తేదీలు పొందుపరచలేదని, చాలాచోట్ల టిక్‌ మార్కులు లేవని జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్‌బాబు ఫిర్యాదుచేశారు. వీటిపై లిఖితపూర్వక సంజాయిషీ ఇవ్వాలని అదీప్‌రాజ్‌ను ఆర్వో ఆదేశించారు. ఆయన వెంటనే సంజాయిషీ ఇవ్వడంతో నామినేషన్‌ ఆమోదించారు. విశాఖపట్నం తూర్పు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ నామినేషన్‌ పత్రం సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించేలా ఉందని, దాన్ని తిరస్కరించాలని టీడీపీ అభ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబు ఫిర్యాదుచేశారు. అఫిడవిట్‌లో క్రిమినల్‌ కేసుల వివరాలు పూర్తిగా పొందుపరచలేదని అభ్యంతరం తెలిపారు. అవన్నీ చిన్నవేనంటూ ఆర్వో కె.మయూర్‌ అశోక్‌ ఎంవీవీ నామినేషన్‌ను ఆమోదించారు.


టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌.. అఫిడవిట్‌లో తనపై ఒడిశాలో ఉన్న కేసుల వివరాలు పొందుపరచలేదని, ఆయన విద్యార్హతల వివరాలు సరిగ్గా లేవని స్వతంత్ర అభ్యర్థి లోతుగడ్డ రాము ఫిర్యాదు చేశారు. అదే అభ్యర్థి దాఖలు చేసిన వేర్వేరు సెట్లలో వేర్వేరుచోట్ల ఆ వివరాలు సక్రమంగానే ఉన్నాయంటూ ఆర్వో దువ్వాడ నామినేషన్‌ను ఆమోదించారు. నెల్లూరు లోక్‌సభ టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి నామినేషన్‌పై వైఎస్సార్‌సీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి పలు అభ్యంతరాలు తెలిపారు. ఆస్తులన్నీ చూపలేదని, అందువల్ల తిరస్కరించాలని కోరారు. అనంతరం నెల్లూరు డిప్యూటీ మేయర్‌ రూప్‌కుమార్‌ యాదవ్‌ చేరుకుని వివరణ ఇవ్వడంతో కలెక్టర్‌ హరినారాయణన్‌ విజయసాయిరెడ్డి అభ్యంతరాలను తోసిపుచ్చి వేమిరెడ్డి నామినేషన్‌ను ఆమోదించారు. ఇలా పలువురు అభ్యర్థుల నామినేషన్లపై అభ్యంతరాలు వచ్చాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com