ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 25, 2024, 08:12 PM

ఏపీలో ఎన్నికల సమరం ఊపందుకుంది. ఈ క్రమంలోనే నేటితో నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసింది. రాష్ట్రంలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 ఎంపీ స్థానాలుండగా.. అన్ని పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ.. 4210 మంది నామినేషన్లు దాఖలు చేయగా.. 25 లోక్‌సభ స్థానాలకు గానూ 731 మంది అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. అయితే.. శుక్రవారం నామినేషన్ల పరిశీలన జరగనుండగా.. 29 వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తయిన తర్వాత ఎన్నికల బరిలో నిలిచి పోరాడే వారి సంఖ్య తేలనుంది.


ఇదిలా ఉంటే.. కొన్ని స్థానాల్లో ఒకే పేరుతో రెండు మూడు నామినేషన్లు వచ్చాయంటూ ప్రచారం జరుగుతోంది. అందులోనూ పిఠాపురం బరిలో నిలుస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పేరుతో ఏకంగా మూడు నామినేషన్లు దాఖలయ్యాయని ప్రచారం జరుగుతోంది. అయితే.. అందులో నిజమేంటంటే.. పిఠాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 23వ తేదీన నామినేషన్ దాఖలు చేశారు. చేబ్రోలులో తన నివాసం నుంచి భారీ ఎత్తున కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లిన పవన్ కళ్యాణ్.. పిఠాపురంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు.


అయితే.. కొనిదెల పవన్ కళ్యాణ్‌తో పాటు కోనేటి పవన్ కళ్యాణ్, కనుమూరి పవన్ కళ్యాణ్ పేరుతో కూడా నామినేషన్లు దాఖలైనట్టు ప్రచారం సాగుతోంది. పవన్ కళ్యాణ్ పేరుతో వేరే వాళ్లు కూడా నామినేషన్లు దాఖలు చేశారని.. సోషల్ మీడియాలో వార్తలు వైరల్ చేస్తున్నారు. నిజానికి.. ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో చెక్ చేస్తే.. పవన్ కళ్యాణ్ పేరుతో మూడు నామినేషన్లు ఉన్నట్టు కనిపిస్తున్నాయి. కానీ.. అవి వేరే వాళ్లు వేసినవి కాదు. ఆ మూడు పవన్ కళ్యాణ్ దాఖలు చేసినవే. మూడు కూడా కొణిదెల పవన్ కళ్యాణ్ అనే ఉన్నాయి.


సాధారణంగా.. కొందరు నేతలు నామినేషన్ దాఖలు చేసేటప్పుడు రెండు గానీ మూడు గానీ సెట్ల అఫిడవిట్లు సమర్పిస్తారు. ఏదైనా తప్పు దొర్లి.. ఏదో ఒకటి తిరస్కరణకు గురైనా.. ఒక్కటైనా ఉంటుందన్న ముందుజాగ్రత్తతో ఇలా మూడు సెట్లు దాఖలు చేస్తుంటారు. అలా వేసిన మూడు నామినేషన్లే.. ఇప్పుడు వెబ్ సైట్‌లో కనిపిస్తున్నాయి. దీంతో.. పవన్ కళ్యాణ్ పేరుతో మూడు నామినేషన్లు అనే వార్తలు పూర్తిగా అవాస్తవం అని తేలింది.


ఇక.. పిఠాపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వంగా గీత బరిలోకి దిగగా.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. ఇక.. కాంగ్రెస్ పార్టీ నుంచి మడెపల్లి సత్యానంద రావు బరిలో నిలిచారు. భారత చైతన్య యువజన పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి బరిలో దిగటం గమనార్హం. ఇక జైభీమ్ రావు భారత్ పార్టీ నుంచి జగ్గారపు మల్లిఖార్జునతో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులు కూడా బరిలో నిలిచారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com