అమరావతి : ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు లెక్కలేనన్ని హామీలిచ్చారని, గద్దెనెక్కాక వాటి అమలు సంగతి మరచిపోయి, ప్రజలను దగా చేస్తున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు. రైతులు, డ్వాక్రా మహిళల రుణ మాఫీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పథకం, ఇళ్ల నిర్మాణం, ఎస్టీ, ఎస్టీల సంక్షేమం, నిరుద్యోగ భృతి వంటి కీలక అంశాలను విస్మరిస్తున్నారని ఆరోపించారు. బుధవారం ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో ఆయా రంగాలకు నిధుల కేటాయింపు తీరు దారుణంగా ఉందని విమర్శించారు. జగన్ బుధవారం సాయంత్రం విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడారు. రంగాల వారీగా బడ్జెట్ కేటాయింపుల తీరును వివరించారు. అరకొర నిధులతో అభివృద్ధి ఎలా సాధ్యమో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన ఏం చెప్పారంటే...బాబు వచ్చారు.. బంగారం వేలం వేస్తున్నారు
రుణమాఫీ కోసం ఈ బడ్జెట్ రూ.3,600 కోట్లు కేటాయించామని గొప్పగా చెప్పారు. ఇప్పటివరకూ మూడేళ్లలో రుణ మాఫీ పథకానికి రూ.10,600 కోట్లు ఇచ్చారు. సంవత్సరానికి సగటున రూ.3,500 కోట్లు ఇచ్చారని అనుకోవచ్చు. రైతుల వ్యవసాయ రుణాలు మొత్తం రూ.87,612 కోట్లు ఉంటే చంద్రబాబు ఏడాదికి ముష్టివేసినట్లు రూ.3,500 కోట్లు ఇచ్చి రుణమాఫీ చేసినట్లు చెబుతూ రైతుల చెవుల్లో క్యాలీఫ్లవర్ పెడుతున్నారు. రైతులు ప్రతి సంవత్సరం వడ్డీ కింద రూ.16,000 కోట్లు చెల్లిస్తున్నారు. వడ్డీలో పావలా వంతు భాగం కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదు. మరోవైపు రైతులకు పంట రుణాలు అందడం లేదు. బ్యాంకుల్లో ఉన్న బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అన్నారు. కానీ, బాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో బ్యాంకులు బంగారాన్ని వేలం వేస్తూ నోటీసులు ఇచ్చాయి. గతంలో వడ్డీ లేకుండా రూ.లక్ష వరకూ, పావలా వడ్డీతో రూ.3 లక్షల వరకూ రుణం లభించేది. ఇవాళ వడ్డీలేని రుణ పథకానికి కేవలం రూ.172 కోట్లు కేటాయించారు. పావలా వడ్డీ కింద ఇచ్చే రుణాలకు రూ.5 కోట్లు మాత్రమే కేటాయించారు.