రికార్డుల పరంపరకు వేదికగా నిలుస్తోంది పోలవరం ప్రాజెక్టు. బహుళార్ధ సాధక ప్రాజెక్టుగా ఆంధ్రప్రదేశ్కు తలమానికంగా నిలవనున్న పోలవరం.. గిన్నిస్ బుక్ లో చోటు కోసం ముందడుగు వేసింది. స్పిల్ ఛానల్లో కాంక్రీట్ పనులు రికార్డు స్థాయిలో నమోదు చేసేందుకు శ్రీకారం చుట్టారు ఏపీ అధికారులు ఈమేరకు ఆదివారం ఉదయం 8 గంటలకు మొదలైన పనులు నాన్స్టాప్ గా 24 గంటల పాటు కొనసాగనున్నాయి.
గిన్నిస్ బుక్ లో పోలవరానికి చోటు కల్పించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈమేరకు 24 గంటలు నాన్స్టాప్ గా స్పిల్ ఛానల్ లో 30 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేసేందుకు అధికారులు తలమునకలయ్యారు. రికార్డు స్థాయిలో ఈ పనులు పూర్తిచేసి గిన్నిస్ బుక్ లో ఛాన్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఆదివారం ఉదయం 8 గంటలకు మొదలైన కాంక్రీట్ ఫిల్లింగ్ పనులు సోమవారం ఉదయం 8 గంటల వరకు నాన్ స్టాప్ గా కొనసాగనున్నాయి. ఈనేపథ్యంలో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధి విశ్వనాథ్ తో పాటు మరో 24 మంది పోలవరం దగ్గర జరుగుతున్న పనులను పరిశీలిస్తున్నారు.
ఇదివరకు దుబాయ్లో నమోదైన రికార్డును అధిగమించేలా ఏపీ అధికారులు ప్లాన్ చేశారు. 2017లో దుబాయిలోని ఒక టవర్ నిర్మాణానికి 36 గంటల (రోజున్నర) వ్యవధిలో 21,580 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ నింపడంతో రికార్డుగా నిలిచింది. అయితే పోలవరం నిర్మాణంలో ఆ రికార్డు బ్రేక్ చేసేలా.. 24 గంటల వ్యవధిలో 30వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ఫిల్లింగ్ కు శ్రీకారం చుట్టారు. 3 నెలల కిందట 24 గంటల వ్యవధిలో 11,158 క్యూబిక్ మీటర్లు.. గత నెల కూడా 11,289 క్యూబిక్ మీటర్ల మేర కాంక్రీట్ నింపడం విశేషం. ఈసారి మాత్రం వాటికి భిన్నంగా రెండున్నర రెట్లు ఎక్కువగా.. 30వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ఫిల్లింగ్ చేయనున్నారు. పోలవరం పనులు చేపట్టిన నవయుగ సంస్థ.. ఏపీ అధికారులతో కలిసి గిన్నిస్ రికార్డు కోసం ప్రయత్నిస్తోంది. 24 గంటల్లో అనుకున్న లక్ష్యం సాధించేలా ఆ కంపెనీ ప్రతినిధులు ఎప్పటికప్పుడు పనులు పర్యవేక్షిస్తున్నారు. అటు గిన్నిస్ బుక్ ప్రతినిధులు ప్రతి 15 నిమిషాలకోసారి గణాంకాలు నమోదు చేస్తున్నారు. సోమవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం పనులు పరిశీలించనున్నారు. మొత్తానికి అనుకున్నది అనుకున్నట్లు జరిగితే పోలవరం గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కడమే గాకుండా ప్రపంచ దృష్టిని ఆకర్షించనుంది.