ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బెంగుళూరు సెంట్రల్ లోక్ సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని, కొంతకాలంగా దేశంలో చోటు చేసుకున్న పరిస్థితులను విమర్శిస్తూ వస్తున్న ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగాలని నిర్ణయించుకున్నారు. ప్రకాష్ రాజ్ రాజకీయ తెరంగేట్రంపై సినీ రాజకీయ ప్రముఖుల నుంచి మద్దతు లభిస్తోంది. కమల్ హాసన్ స్పందిస్తూ... రాజకీయ జర్నీ మొదలు పెట్టిన నా ప్రియమైన మిత్రుడికి శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. బాలీవుడ్ నటి స్వర భాస్కర్ 'నేను మీకు ఓటు వేస్తాను సర్, నా మద్దతు మీకు ఎప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు.
తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అరవింద్ర కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కూడా ప్రకాష్ రాజ్కు మద్దతు లభించింది. ప్రకాష్ రాజ్ తీసుకున్న నిర్ణయాన్ని బెంగుళూరు ప్రజలు సైతం స్వాగతిస్తున్నారు.
లోక్ సభ ఎన్నికలకు కొన్ని రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఇప్పటి నుంచే ప్రకాష్ రాజ్ తన ప్రచారం మొదలు పెట్టబోతున్నారు. బెంగుళూరు సెంట్రల్ నియోజకవర్గం లోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి ప్రజల మద్దతు కూడగట్టనున్నారు.