ఉత్తర ప్రదేశ్ ఐఏఎస్ అధికారి చంద్రకళ పై సీబీఐ కేసు నమోదు చేసింది. నిన్నమొన్నటి వరకు వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకుల ఇళ్లపై సీబీఐ దాడులు చూశాం. ఇప్పుడు ఏకంగా ఓ ఐపీఎస్ అధికారి ఇంటిపై సీబీఐ దాడులు చేయడం పోలీస్ వర్గాల్లో కలకలం రేపుతోంది. యూపీలో ఐఏఎస్ అధికారిగా ఉన్న చంద్రకళ ఇంటిపై శనివారం సీబీఐ దాడులు చేసింది. మైనింగ్ స్కాంలో ఆమెపై ఆరోపణలు ఉన్నాయి.
ఆమె నివాసముంటున్న ఇంటితో పాటు స్వస్థలం కరీంనగర్ లో దాడులు కొనసాగుతున్నాయి. ఇసుక మాఫియాతో పాటు మైనింగ్ మాఫియాతో చంద్రకళకు సంబంధాలున్నట్లు... దీంతో ఆమె కోట్లాది రూపాయలు వెనకేసుకున్నారనే ఆరోపణలు రావడంతో ఆమెపై అలహాబాద్ హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. అలహాబాద్ హైకోర్టు ఆదేశాలతో సీబీఐ కేసు నమోదు చేసి ఏకకాలంలో 12 చోట్ల దాడులకు దిగింది. జలౌన్, హమీర్ పూర్, లక్నో, ఢిల్లీ ప్రాంతాలలో తనిఖీలు చేపట్టారు. సీబీఐ సోదాల్లో విలువైన డాక్యుమెంటు, ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఆమె బ్యాంకు లాకర్లను తెరిచి చూస్తున్నారు.
చంద్రకళ ...కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డి మండలం గర్జన పల్లి గ్రామానికి చెందినవారు. 2008లో ఐఏఎస్ కు ఎంపికయ్యారు. సివిల్ సర్వీసులో 409 ర్యాంకు పొందిన ఆమె యూపీ రాష్ట్రానికి కేటాయించబడ్డారు. చంద్రకళ భర్త ఏ.రాములు తెలంగాణ సాగునీటి శాఖలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. చంద్రకళ అలహాబాద్, హమీర్ పూర్, మథుర, బులంద్ షహర్ లో పనిచేశారు. చంద్రకళను స్వచ్ఛ భారత్ అభియాన్ డైరెక్టర్ గా, తాగునీటి మంత్రిత్వశాఖ డిప్యూటీ సెక్రెటరీగా నరేంద్ర మోదీ నియమించారు. యూపిలోలని బిజ్నోర్, బులంద్ షహర్, మీరట్ లో ఆమె స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమం విజయవంతం చేసేందుకు విశేషంగా పనిచేశారు. ఆమె పనితీరును మెచ్చుకున్న ప్రధాని మోదీ ఢిల్లీలో పోస్టింగ్ ఇప్పించారు.
నిన్న మొన్నటి వరకు చంద్రకళ డైనమిక్ ఆఫీసర్ అని, అక్రమార్కుల పట్ల కఠినంగా ఉంటారని సామాజిక మాద్యమాల్లో హోరెత్తించారు. నిజాయితీపరురాలు, అవినీతి పరుల పాలిట సింహస్వప్నం అంటూ ప్రచారం చేశారు. తాజాగా ఆమెపై అవినీతి ఆరోపణలు రావడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు.