సంక్రాంతి అంటే పెద్ద పండగ. కుటుంబమంతా కలిసి ఆనందంగా జరుపుకొనే వేడుక. అందుకే ఎక్కడెక్కడ ఉన్నవారంతా సంక్రాంతి వచ్చిందంటే చాలు...అంతా ఒక గూటికి చేరుకుంటారు. సొంతూరులో కుటుంబమంతా కలిసి ఆనందంగా సంబురాలు చేసుకుంటున్నారు. సంక్రాంతికి దూర ప్రాంతాల నుంచి అంతా పల్లెలకు క్యూ కడతారు. అందుకే ఈ పెద్ద పండగ కోసం ఆర్టీసీ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంటుంది.
ఇక సిటీలోఉన్నవాళ్లు సైతం ఒక చోటు నుంచి వేరే చోటుకు వెళ్తుంటారు. అయితే ఈ సంక్రాంతికి హైదరాబాద్ రోడ్లపై ఎలక్ట్రిక్ బస్సులు రయ్ రయ్ మని పరుగెత్తనున్నాయి. ఇప్పటి వరకు డీజీల్ బస్సులలో ప్రయాణం చేసిన వారికి ఎలక్ట్రిక్ బస్సులలో ప్రయాణించేందుకు ఆర్టీసి ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రయోగాత్మకంగా వీటిని శంషాబాద్ రూట్ లో నడిపిస్తున్నారు. పండుగ నుంచి నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి నడిపించనున్నారు.
నగరంలో వంద ఎలక్ట్రిక్ బస్సులను 2019 సంవత్సరంలో ప్రవేశపెట్టాలని టీఎస్ ఆర్టీసి నిర్ణయించింది. ఆర్టీసీ అద్దె ప్రాతిపదికన 100 ఎలక్ట్రికల్ బస్సులను నడిపించేలా ఓ ప్రైవేట్సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. అందులో భాగంగా మొదటి విడతలో 40 ఎలక్ట్రికల్ బస్సులను ఈ నెలలో అందుబాటులోకి తీసుకొస్తోంది. మియాపూర్- 2, కంటోన్మెంట్ డిపోలకు 20 ఎలక్ట్రికల్ బస్సులు కేటాయించారు.
ఎలక్ట్రికల్ బస్సులకు చార్జింగ్ చేసేందుకు కంటోన్మెంట్, మియాపూర్-2 డిపోలో ప్రత్యేకంగా చార్జింగ్ స్టేషన్లు సిద్ధంచేశారు. బస్సులను, డ్రైవర్ల పనితీరు పరీక్షించేందుకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ రూట్లలో ఈ బస్సుల ప్రయోగాత్మకంగా నడుపుతున్నారు. బస్సులు నడిపే డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతోపాటు మెడికల్ పరీక్షలు కూడా ఆర్టీసీ పూర్తిచేసింది. ఉన్నతాధికారుల నుంచి అనుమతి రాగానే సంక్రాంతి నుంచి ప్రయాణికులకు ఎలక్ట్రికల్ బస్సులు అందుబాటులోకి వస్తాయని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.