జోధ్పూర్: కాంగ్రెస్ పార్టీ అబద్ధాల విశ్వవిద్యాలయమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. అక్కడి వాళ్లు అబద్ధాలు చెప్పడంలో పీహెచ్డీ చేస్తున్నారని, ఎవరు బాగా అబద్ధాలు చెప్తే వారికి మంచి పదవి కూడా దక్కుతుందని ఎద్దేవా చేశారు. రాజస్థాన్లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న మోదీ కాంగ్రెస్పై విమర్శలు చేశారు. రాజస్థాన్లో ఒకసారి అధికారంలో ఉన్న వారు వరుసగా రెండోసారి గెలవడం లేదని, కాబట్టి ఈసారి గెలుస్తామని కాంగ్రెస్ భ్రమపడుతోందన్నారు. కానీ ఈ సారి మాత్రం అలా జరగని మోదీ వెల్లడించారు. రాజస్థాన్ సహా మిగతా రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలుస్తుందన్న వారి కలలు కూలిపోతాయని అన్నారు.
ప్రపంచానికి భూఉష్ణతాపం అంటే ఏమిటో తెలియకముందే రాజస్థాన్లోని బిష్ణోయి తెగ పర్యావరాణాన్ని కాపాడేందుకు ఎంతో కృషి చేసిందని మోదీ ప్రశంసించారు. ప్రజలకు అన్ని విషయాలు తెలుసు అని, తన రిమోట్ కంట్రోల్ ప్రజల చేతుల్లోనే ఉందన్నారు. అందుకే తాను సరిగ్గా పనిచేయగలుగుతున్నానని మోదీ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అసలు అభివృద్ధి గురించి మాట్లాడడం లేదని విమర్శించారు. ప్రజలు విద్య, విద్యుత్ తదితర సమస్యలకు పరిష్కారం కోసం ఓటు వేస్తారా.. నాకు హిందుత్వం గురించి తెలుసా, లేదా అనే విషయం ఆధారంగా ఓటు వేస్తారా అని మోదీ ప్రజలను ప్రశ్నించారు. హిందుత్వం గురించి కాంగ్రెస్ చేసిన విమర్శలపై ఆయన పై విధంగా స్పందించారు. రాజస్థాన్లో డిసెంబరు 7న పోలింగ్ జరగనుంది.