విజయవాడ : డీపీఆర్ ను ఆమోదించి, కేంద్ర జలవనరుల శాఖ సత్వరమే నిధులు విడుదల చేయాలని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. విజయవాడలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ…. డీపీఆర్-2కు ఆమోదం తెలిపితే మరో రూ.26,453కోట్లు విడుదలవుతాయన్నారు. తుపాను ప్రభావంతో దక్షిణకోస్తాలో భారీ వర్షాలు పడతాయన్నారు. 7 జిల్లాల్లో పంటలు చేతికొచ్చే సమయమైనందున రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈనెల 21న గోదావరి, పెన్నా నదుల అనుసంధానానికి సీఎం శంకుస్థాపన చేస్తారన్నారు. సాగర్ కుడి కాల్వ వద్ద చంద్రబాబు శంకుస్థాపన చేస్తారన్నారు. వైకుంఠపురం బ్యారేజీ నిర్మాణానికి కూడా త్వరలో టెండర్లు ఖరారు చేస్తామన్నారు. పట్టిసీమ వల్లే డెల్టాతో పాటు, రాయలసీమ కూడా నీటితో కళకళలాడుతోందని, పట్టిసీమ దండగ అన్న జగన్ ప్రజలకు ఇప్పుడేం సమాధానం చెబుతారని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. రాజకీయ కుట్రతో జగన్ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్నారు. 16 నెలలు జైలుకెళ్లానంటున్న జగన్.. ఎందుకెళ్లాడో కూడా ప్రజలకు చెప్పాలన్నారు. అధికారులతో మాట్లాడేందుకు జలవనరుల శాఖ అధికారులు ఢిల్లీ వెళ్లారన్నారు. అన్ని పత్రాలను కేంద్రానికి అందజేసినా నిధుల విడుదలలో జాప్యం చేస్తున్నారన్నారు.