రాయ్పూర్ : ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్పై అటల్ బిహారీ వాజపేయి మేనకోడలు కరుణ శుక్లా మండిపడ్డారు. 15 సంవత్సరాలు రమణ్సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఛత్తీస్గఢ్లో అభివృద్ధి శూన్యమని ఆమె అన్నారు. పదేళ్లుగా రాజ్నంద్గావ్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న రమణ్సింగ్.. కనీసం నియోజకవర్గం అభివృద్ధికి కూడా కృషి చేయలేదన్నారు కరుణ శుక్లా. ఈ క్రమంలోనే తనను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇక్కడకు పంపారని ఆమె స్పష్టం చేశారు. ప్రజల పక్షాన పోరాడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని కరుణ శుక్లా తేల్చిచెప్పారు. అటల్ బిహారీ వాజపేయి, లాల్కృష్ణ అద్వానీ సిద్ధాంతాలను బీజేపీ విస్మరించిందన్నారు. ప్రస్తుతమున్న బీజేపీ అగ్రనాయకత్వం విధానాలు నచ్చకనే పార్టీని వీడాల్సి వచ్చిందన్నారు. 2013లో కరుణ శుక్లా.. కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిన్న ప్రకటించిన కాంగ్రెస్ రెండో జాబితాలో కరుణ శుక్లా పేరును వెల్లడించారు. కరుణ శుక్లా రాజ్నంద్గావ్ నియోజకవర్గం నుంచి రమణ్సింగ్పై పోటీ చేయనున్నారు.