ముంబై: ముంబైలో ఇవాళ విమాన ప్రయాణికులకు కొన్ని కష్టాలు ఎదురుకానున్నాయి. విమానాశ్రయాన్ని మెయింటెనెన్స్ కోసం మూసివేస్తున్నారు. ఇవాళ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం అయిదు గంటల వరకు .. విమానాశ్రయంలోని మెయిన్, సెకండరీ రన్వేలను మూసివేస్తున్నారు. రన్వేలను రిపేర్ చేయనున్నట్లు అధికారులు చెప్పారు. మొత్తం రెండు దశల్లో రిపేర్ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మొదటి దశ అక్టోబర్ లో, రెండవ దశ ఫిబ్రవరిలో మెయింటెనెన్స్ ఉంటుందని ఎయిర్పోర్ట్ అధికారులు చెప్పారు. అయితే ఒక్క రోజు ఆరు గంటల పాటు రన్వేలను మూసివేయడం వల్ల సుమారు 300 విమానాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురుకానున్నాయి. ప్రతి రోజూ ప్రైమరీ రన్వేపై 50 అరైవల్స్, డిపార్చల్స్ ఉంటాయి. సెకండరీ రన్వేపై ప్రతి రోజూ 35 ఫ్లయిట్లు వస్తూ వెళ్తుంటాయి. సగటున ప్రతి రోజూ ముంబై విమానాశ్రయంలో వెయ్యి ఫ్లయిట్లు వస్తూపోతుంటాయి.