ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేవరగట్టులో కర్రల సమరం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 20, 2018, 11:16 AM

కర్నూలు జిల్లా దేవరగట్టులో జరిగిన కర్రల సమరంలో ఈ ఏడాదీ హింస తప్పలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా వేలాది మంది బన్ని ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ కర్రల సమరంలో 35 మంది గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఏటా విజయదశమి రోజు కర్రల సమరం జరగడం ఆనవాయితీగా వస్తోంది. హోళగొంద మండలం దేవరగట్టు సమీపంలో ఉన్న కొండపై వెలసిన మాళమ్మ మల్లేశ్వరస్వామికి రాత్రి 12 గంటలకు కల్యాణం జరిపించారు. అనంతరం కొండ పరిసర ప్రాంతాల్లో ఉన్న పాదాలగట్టు, రక్షపడ, శమీవృక్షం, ఎదురు బసవన్న గుడి ప్రాంతాల్లో దివిటీల వెలుతురులో ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు. ఈ ఉత్సవ విగ్రహాలు దక్కించుకోవడం కోసం మూడు గ్రామాల ప్రజలు ఓ వర్గంగా, ఐదు గ్రామాల ప్రజలు మరో వర్గంగా ఏర్పడి కర్రలతో తలపడ్డారు. ఇందులో ఇరు వర్గాల వారు తీవ్రంగా గాయపడ్డారు. దీనిని స్థానికులు బన్ని ఉత్సవంగా వ్యవహరిస్తారు. ఈ ఉత్సవాలను తిలకించేందుకు ఏపీ, కర్ణాటకకు చెందిన లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు.


బన్ని ఉత్సవంలో హింస జరగకుండా ఉండేందుకు పోలీసులు చేపట్టిన చర్యలు ఏ మాత్రం ఫలించలేదు. సీసీ కెమెరాలు, డ్రోన్‌ కెమెరాలతో నిఘాను పటిష్టం చేశారు. వెయ్యి మందికిపైగా పోలీసులతో బందో బస్తు చేపట్టారు. నెల రోజుల ముందు నుంచే అవగాహన కార్యక్రమాలు, ఫ్లెక్సీలు, లఘు చిత్రాలతో ప్రచారం నిర్వహించారు. ఎన్ని చర్యలు చేపట్టినా ప్రజలు తమ సంప్రదాయాన్ని కొనసాగించారు. ఈ ఉత్సవంలో 35 మందికి తీవ్ర గాయాలైనట్లు అధికారులు తెలిపారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆలూరు, ఆదోని ఆస్పత్రులకు తరలించారు. అయితే కర్రల సమరంలో ప్రాణనష్టం లేకపోవడంతో పోలీసులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com