అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించనున్నారు. ప్రతి మూడో సోమవారం పోలవరంలో ఆయన పర్యటించనున్నారు. దసరా నాటికి రేడియల్ గేట్ల బిగింపు కార్యక్రమాన్ని చేపట్టాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నా తుది డిజైన్లకు కేంద్ర జల సంఘం నుంచి ఆమోదం లభించకపోవడంతో వాటిని వాయిదా వేశారు. వాస్తవానికి ఈ డిజైన్లకు గత బుధ, గురువారాల్లోనే ఆమోదం తెలుపుతామంటూ కేంద్ర జల సంఘం వెల్లడించింది. కానీ, ఇప్పటిదాకా వాటిని ఆమోదించలేదు. దీంతో.. వీటి బిగింపు ప్రక్రియ వాయిదా పడింది. ముఖ్యమంత్రి పోలవరం పర్యటన సందర్భంగా గేట్ల బిగింపు తేదీని ఖరారు చేసే జలవనరుల శాఖ వర్గాలు వెల్లడించాయి.