పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ హాస్పిటల్ లో చేరాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న అబుదాబీ టెస్ట్ నాలుగో రోజైన శుక్రవారం నాడు సర్ఫరాజ్ మైదానంలోకి రాలేదు. తలలో విపరీతమైన నొప్పి వస్తోందని అతను చెప్పడంతో టీమ్ మేనేజ్ మెంట్ హుటాహుటిన అతడిని ఆస్పత్రికి తరలించింది. సర్ఫరాజ్ స్థానంలో మొహమ్మద్ రిజ్వాన్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టాడు. కెప్టెన్ గా అషద్ షఫీక్ వ్యవహరించాడు.
గురువారం సర్ఫరాజ్ అహ్మద్ బ్యాటింగ్ చేస్తుండగా కంగారూ పేస్ బౌలర్ పీటర్ సిడెల్ వేసిన బంతి హెల్మెట్ పై బలంగా తగిలింది. అప్పుడు సర్ఫరాజ్ 32 పరుగులు చేసి ఆడుతున్నాడు. హెల్మెట్ కి బంతి తగిలినప్పటికీ పాక్ కెప్టెన్ మైదానం వీడిపోకుండా ధైర్యంగా ఆడి 123 బంతులు ఎదుర్కొని 81 పరుగులు చేశాడు. ఆ తర్వాత మ్యాచ్ నాలుగో ఇన్నింగ్స్ లో వికెట్ కీపింగ్ చేయడానికి దిగాడు. కానీ నాలుగో రోజైన ఇవాళ సర్ఫరాజ్ తలనొప్పిగా ఉందని చెప్పాడు. దీంతో ముందు జాగ్రత్తగా టీమ్ మేనేజ్ మెంట్ అతడిని మైదానంలో దింపకుండా ఆస్పత్రికి తరలించింది. అక్కడ సర్ఫరాజ్ తలకు సీటీ స్కాన్, ఇతర పరీక్షలు చేశారు.