చైనాలోని టిబెట్లో ప్రకృతి ప్రకోపించింది. భారీవర్షాల వల్ల పరవళ్లు తొక్కుతున్న యార్లుంగ్ సాంగ్పో నదిని విరిగిపడిన ఓ పెద్ద కొండచరియ అడ్డుకున్నది. దాంతో నదీమార్గం మూసుకుపోయింది. చుట్టూ నీరు విస్తరించి ఓ రిజర్వాయర్లా తయారైంది. చుట్టుపక్కలకు నీరు చెల్లాచెదురు కావడంతో వరదల ముప్పు ఏర్పడింది. మెన్లింగ్ జిల్లాలో ఈ ఉత్పాతం జరిగింది. లోతట్టు ప్రాంతాల్లోని ఆరువేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ నది వచ్చి బ్రహ్మపుత్రలో కలుస్తుంది. అందువల్ల చైనా ప్రభుత్వం భారత్ను అప్రమత్తం చేసింది. ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందజేస్తున్నది. అరుణాచల్ప్రదేశ్లోని తూర్పు సియాంగ్ జిల్లాలో చైనా నుంచి యార్లుంగ్ భారత్లోకి ప్రవేశిస్తుంది. కొండచరియల కారణంగానీటి ప్రవాహం తగ్గింది. కానీ వాటిని తొలగించిన తర్వాత ఒక్కసారిగా నదిలో నీటిమట్టం పెరిగే అవకాశముంది. కనుక ప్రజలెవ్వరూ నది సమీపానికి వెళ్లొద్దని తూర్పు సియాంగ్ జిల్లా మేజిస్ట్రేటు స్థానిక ప్రజలకు హెచ్చరికలు జారీచేశారు.