ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ ఇప్పుడు ‘ధమాకా సేల్’ పేరుతో మరోసారి ఆఫర్ల సందడి తెరతీయనుంది. దసరా పండుగ సందర్భంగా ఫ్లిప్కార్ట్ ‘బిగ్ బిలియన్ డేస్’ పేరిట నాలుగు రోజుల పాటు విక్రయాలు నిర్వహించి సరికొత్త రికార్డులను సృష్టించింది. ఇప్పుడు వినియోగదారులను మరోసారి ఆకర్షించేందుకు ఆఫర్లతో ముందుకు వచ్చింది. ధమాకా సేల్ పేరుతో అక్టోబరు 24 నుంచి 27 వరకు మరో నాలుగు రోజుల పాటు ఆఫర్ల పండుగ నిర్వహించనుంది. అన్ని ఉత్పత్తులపై భారీగా డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
ఫ్లిప్కార్ట్ ప్లస్ సభ్యులు ఒక రోజు ముందు నుంచే ఈ ఆఫర్ను ఉపయోగించుకోవచ్చు. అక్టోబరు 23 ఉదయం 9 గంటల నుంచి ఫ్లిప్కార్ట్ ప్లస్ సభ్యులకు ఇది అందుబాటులోకి రానుంది. వినియోగదారులకు రాయితీ కల్పించేందుకు ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్తో జత కట్టింది. యాక్సిస్ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డు వినియోగదారులు ఈ ఆఫర్ కింద డిస్కౌంట్ లేదా క్యాష్బ్యాక్ను పొందవచ్చు. అయితే అది ఎంత వరకు ఉంటుందనే విషయాన్ని మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఎంపిక చేసిన డెబిట్ కార్డుల మీద ఈఎంఐ సదుపాయాన్ని ఇస్తున్నారు. ఫెస్టివ్ ధమాకా డేస్లో భాగంగా ఈసారి కూడా పలు కంపెనీల స్మార్ట్ఫోన్లపై భారీగా డిస్కౌంట్ ఇస్తున్నట్లు సంస్థ ప్రకటించింది.
టెలివిజన్, గృహోపకరణాలపై 70శాతం డిస్కౌంట్ ఇవ్వనుంది. టీవీ, గృహోపకరణాల విభాగంలో 500 బ్రాండ్స్, 38,000 ఉత్పత్తులపై ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. ఇక ఎలక్ట్రానిక్, యాక్ససరీస్ విభాగంలోని మూడు కోట్ల ఉత్పత్తులపై 80% రాయితీని ప్రకటించింది. ఈనెలలో 10 నుంచి 14 వ తేదీ వరకు ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ పేరిట విక్రయాలను నిర్వహించిన విషయం తెలిసిందే. ఆఫర్ తొలిరోజు భారత రిటైల్ రంగంలోనే అత్యధికంగా స్మార్ట్ఫోన్ల విక్రయాలు జరిపి ఫ్లిప్కార్ట్ సరికొత్త రికార్డులను సృష్టించింది. 24 గంటల వ్యవధిలోనే దాదాపు 30లక్షల స్మార్ట్ఫోన్లను విక్రయించింది.