న్యూఢిల్లీ: లాయర్లుగా ఉన్న వారు ఒకవేళ ఎమ్మెల్యే, ఎంపీగా ఎన్నికైతే వారు ప్రాక్టీసు చేపట్టరాదు అని వేసిన పిటీషన్ను సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నియమావళి ప్రకారం ఇలాంటివి ఏమీ వర్తించవని సుప్రీం తెలిపింది. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. జస్టిస్ ఖాన్విల్కర్, చంద్రచూడ్లు కూడా ఆ బెంచ్లో ఉన్నారు. బీజేపీ నేత అశ్వినీ ఉపాధ్యాయ ఈ పిల్ వేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్నవారెవ్వరూ న్యాయస్థానాల్లో ప్రాక్టీసు చేయరాదు అని ఆయన తన పిటిషన్లో అభ్యర్థించారు. అయితే ఎమ్మెల్యే అయినా లేక ఎంపీ అయినా కేవలం ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి మాత్రమే అని, వారెవరూ ప్రభుత్వ ఉద్యోగులు కాదని గతంలో కేంద్రం తన అభిప్రాయాన్ని వినిపించింది. ఆ అభిప్రాయాన్ని ఆధారం చేసుకున్న సుప్రీం ఈ కేసులో తీర్పును వెలువరించింది. ప్రభుత్వ ఉద్యోగి న్యాయవాదిగా ప్రాక్టీసు చేయరాదు అని సుప్రీం అభిప్రాయపడింది.