చెన్నై: ‘దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంలో ఓ రహస్యం దాగుంది. అస్పత్రులు, ప్రభుత్వం ఇచ్చిన నివేదికల్లో పొంతన లేదు’ అని మాజీ ముఖ్యమంత్రి పన్నీర్సెల్వం పేర్కొన్నారు. జయలలిత మరణంపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ... బుధవారం రాష్ట్రవ్యాప్తంగా పన్నీర్సెల్వం మద్దతుదారులు నిరాహార దీక్షలు చేశారు. ఇందులో భాగంగా చెన్నైలోని ఎగ్మూర్ రాజారత్నం మైదానంలో పన్నీర్సెల్వం ఒకరోజు నిరాహార దీక్ష చేశారు. దాదాపు నాలుగు వేల మంది మద్దతుదారులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. సాయంత్రం నిరాహారదీక్షను విరమించిన అనంతరం పన్నీర్సెల్వం విలేకరులతో మాట్లాడుతూ జయలలిత మరణంపై ఎయిమ్స్, అపోలో, ప్రభుత్వం ఇచ్చిన నివేదికల్లో పొంతన లేదన్నారు. జయ మరణంపై అనేక అనుమానాలు ఉన్నాయని, అవి నివృత్తి కావాలన్నారు. తాను అపోలో ఆస్పత్రిలో జయలలితను చూడలేదని, ఆమెకు అందించిన వైద్యసేవలపై తనకు ఎవరూ చెప్పలేదన్నారు. జయలలితకు ఆస్పత్రిలో ఇచ్చిన వైద్యం విషయంలో కూడా అనుమానాలు ఉన్నాయన్నారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నిక చెల్లదని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని, ఈ విషయంలో ఈనెల 10న ఎన్నికల సంఘం ఒక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని తెలిపారు. ఈ సందర్భంగా పన్నీర్సెల్వం మద్దతుదారుడు, అన్నాడీఎంకే సీనియర్ నేత మధుసూదనన్ మాట్లాడుతూ రాష్ట్రంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ వర్గం ఒక మాఫియాలా తయారైందని, వారిపై కూడా న్యాయ విచారణ జరపాలన్నారు. గతంలో వారి ఆస్తులు, ప్రస్తుతం ఉన్న ఆస్తులపై నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. తామే అసలైన అన్నాడీఎంకే పార్టీవాదులమని పేర్కొన్నారు. జయలలిత ఆశయాలకు వ్యతిరేకంగా ప్రస్తుతం పళనిస్వామి ప్రభుత్వం కొనసాగుతోందన్నారు.