ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అతివేగం మిగిల్చిన శోకం... బస్సు, వ్యాను ఢీకొని ఆరుగురు దుర్మరణం కొద్దిసేపట్లోనే విషాదంగా మారిన వివాహ నిశ్చితార్థం సంబరం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 09, 2017, 09:14 AM

అతివేగం ఆరుగురి ప్రాణాలు తీసింది. నిశ్చితార్థం విందుకు వెళ్లి తిరిగి వస్తున్న వారికి విషాదాన్ని మిగిల్చింది. శుభకార్యం సంబరం కొద్దిసేపట్లోనే ఆవిరైపోయింది. తిరువణ్ణామలై వద్ద సంభవించిన రహదారి ప్రమాదం రెండు కుటుంబాలను తీవ్రంగా కలచివేసింది.


              తిరువణ్ణామలై: పోలూరు వద్ద ప్రైవేటు బస్సు, వ్యాను ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందగా 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. వ్యాను డ్రైవరు అతివేగంగా నడపడటం వలనే ప్రమాదం సంభవించినట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. వివాహ నిశ్చితార్థానికి వెళ్లి వస్తూండగా ఈ ప్రమాదం సంభవించింది. తిరువణ్ణామలై జిల్లా చెయ్యారుకు చెందిన వరుడు మోహన్‌కు కలసపాక్కం వద్ద పళంగోయిల్‌ గ్రామానికి చెందిన యువతితో పెళ్లి నిశ్చయమైంది. బుధవారం వరుడు కుటుంబీకులకు వధువు ఇంట్లో విందు ఏర్పాటు చేశారు. ఈ విందు కోసం మోహన్‌ కుటుంబీకులు మూడు వ్యానులలో పళంగోయిల్‌ గ్రామానికి వెళ్లారు. విందు అనంతరం వారు వధువు ఇంటి వారిని బుధవారం రాత్రి తాము ఏర్పాటు చేసిన విందులో పాల్గొనాలని ఆహ్వానించారు. అందుకు వధువు కుటుంబసభ్యులు అంగీకరించారు. ఆ తర్వాత వరుడు మోహన్‌ కుటుంబీకులు మూడు వ్యాన్‌లలో చెయ్యారుకు బయలుదేరారు. మధ్యాహ్నం 1.45 గంటలకు వ్యానులు పోలూరు వద్ద ఎట్టివాడి గ్రామ మూడు రోడ్ల కూడలిలో వెళుతూండగా ప్రమాదం సంభవించింది. వేలూరు నుంచి తిరువణ్ణామలైకు వెళుతున్న ప్రైవేటు బస్సు మూడవ వ్యానును ఎదురుగా ఢీకొంది. ఈ ప్రమాదంలో వ్యాను నుజ్జునుజ్జయింది. బస్సు ముందుభాగం దెబ్బతింది. వ్యానులో ప్రయాణించిన తిమిరికి చెందిన కమల (70), మణి (55), సెల్వరాజ్‌ (45), చెయ్యారుకు చెందిన సరోజ (48), తిరునావుకరసు (55)లు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 12 మందిని పోలూరు ప్రభుత్వాస్పత్రికి, ఆరుగురిని వేలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరిలో చికిత్స ఫలించక 60 ఏళ్ల మహిళ మృతి చెందింది. ప్రమాద వార్త అందగానే పోలూరు శాసనసభ్యుడు శేఖరన్‌, అదనపు డీఎస్పీ రాజేంద్రన్‌, డీఎస్పీ రాజన్‌, ఇన్‌స్పెక్టర్‌ సాలమన్‌రాజ్‌లు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ ప్రమాదానికి కారణమైన వ్యాను డ్రైవర్‌ పరారయ్యాడు. కళంబూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com