సూర్య,అమరావతి: రాజధాని అమరావతిని విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారితో అనుసంధానిస్తూ కృష్ణానదిపై రెండంతస్తుల ఐకానిక్ బ్రిడ్జి నిర్మించాలని నిర్ణయించారు. కాజ-పెద అవుటుపల్లి మధ్య విజయవాడ బైపాస్ రహదారిలో భాగంగా దీన్ని నిర్మిస్తారు. కూచిపూడి నృత్య భంగిమను పోలిన ఆకృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు మొగ్గు చూపారు. రెండంతస్తులతో సిద్ధం చేసిన మరో ఆకృతిని దీనితో మేళవించి 15రోజుల్లో తుది రూపాలు సిద్ధం చేయాల్సిందిగా ఆయన సూచించారు. బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన రాజధానిపై సమీక్షా సమావేశం జరిగింది. ఎల్ అండ్ టీ సంస్థ రూపొందించిన ఆరు ఆకృతుల్ని ముఖ్యమంత్రి పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన సంప్రదాయ కూచిపూడి
భంగిమను పోలిన రెండో ఆకృతి చాలా బాగుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పుష్పాన్ని పోలినట్లుగా రెండంతస్తులతో రూపొందించిన నాలుగో ఆకృతి కూడా ఆయనను ఆకట్టుకుంది. ఆ ఆకృతిలో వాహనాలు వెళ్లడానికి, పాదచారులకు వేర్వేరు మార్గాలు ప్రతిపాదించారు. వంతెన పైభాగంలో మారథాన్, జాగింగ్, యోగా వంటి ఉదయపు వ్యాయామాలు, వీధి వేడుకలు, ఫుడ్కోర్డులు, సైక్లింగ్, ఉత్సవాలకు వినియోగించవచ్చునని సూచించారు. వీటిని పరిశీలించిన ముఖ్యమంత్రి.. రెండు, నాలుగు ఆకృతుల మేళవింపుగా వంతెన ఉండాలన్నారు. రెండంతస్తుల బ్రిడ్జిలో పైభాగాన్ని వినోద, క్రీడా ప్రదేశంగా తీర్చిదిద్దవచ్చన్నారు. పై నుంచి నదికి ఉపమార్గాలుంటే అక్కడ జలక్రీడలకు అనువైన థీమ్ పార్కులు ఏర్పాటు చేయవచ్చని తెలిపారు. జలక్రీడలకు అనువుగా బ్రిడ్జి నిర్మించే ప్రాంతంలో నదిలో దీవులు ఏర్పాటు చేయవచ్చన్నారు. కన్యాకుమారి తరహాలో వారధి పైభాగం సూర్యోదయ వీక్షణకు వీలుగా వ్యూపాయింట్గా నిలిచిపోవాలని తెలిపారు. బ్రిడ్జి పైభాగంలో ఫుడ్ కోర్టులు, షాపింగ్ సెంటర్ల ఏర్పాటు ద్వారా ఆదాయం సమకూరుతుందన్నారు. రాజధాని అమరావతిలో ప్రవేశించేందుకు కృష్ణానదిపై నిర్మించే మొదటి వారధి కాబట్టి దీన్ని అద్భుతంగా, ప్రతిష్ఠాత్మకంగా కట్టాలని తెలిపారు.