పోలెండ్లోని గ్లివైస్ వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ సిలెసియన్ ఛాంపియన్షిప్లో భారత మహిళా బాక్సర్లు అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. ఈ పోటీల్లో మనీషా, మేరీ కోమ్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. వీరితో పాటు సందీప్ కౌర్, నేహా, దినేశ్ నాయక్, ఎల్ సరితా దేవి, రితూ గ్రేవాల్లకు పతకాలను సాధించారు.దీంతో భారత్ ఖాతాలోకి 7 పతకాలు వచ్చి చేరాయి. జూనియర్ విభాగంలో 51 కేజీల ఈవెంట్లో సందీప్ కౌర్ స్వర్ణం సాధించి, చరిత్ర సృష్టించింది. ఇక, 54 కేజీల ఈవెంట్లో ఫైనల్ చేరిన నేహా, 63 కేజీల ఈవెంట్లో ఫైనల్ చేరిన దినేశ్ నాయక్ మాత్రం ఫైనల్ పోరులో ఓటమిపాలై రజత పతకంతో సరిపెట్టుకున్నారు.మాజీ యూరోపియన్ ఛాంపియన్ విక్టోరియా కులెషోవాను 5-0 తేడాతో చిత్తు చేసిన మనీషా 54 కేజీల ఈవెంట్లో ఫైనల్ చేరింది. ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ మేరీకోమ్ 48 కేజీల సీనియర్ కేటగరిలో ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆసియా గేమ్స్లో కాంస్య పతకం సాధించిన సరితా దేవి సిలెసియన్ ఛాంపియన్షిప్లోనూ తన జోరుని కొనసాగించింది.
చెక్ రిపబ్లిక్ బాక్సర్ అలెనా క్లెచీని 5-0 తేడాతో ఓడించి సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది. మరో భారత బాక్సర్ రితూ గ్రేవల్, రష్యా బాక్సర్ స్వేల్టానా రోస్జాను 4-1 తేడాతో ఓడించి 51 కేజీల కేటగిరిలో సెమీ ఫైనల్ చేరింది. వీరితో పాటు ఆసియన్ యూత్ ఛాంపియన్ మనీషా 54 కేజీల కేటగిరిలో ఫైనల్ చేరింది.
81 కేజీల కేటగిరిలో పూజా రాణి క్వార్టర్ ఫైనల్స్లో ఉక్రెయిన్ బాక్సర్ అనాస్టాన్సియా చెర్నోకొలినోను 5-0 చిత్తు చేసి సెమీస్ చేరింది. యూత్ కాంపిటేషన్లో జ్యోతి గులియా 51 కేజీల కేటగిరిలో జర్మనీ బాక్సర్ రఫెలాపై విజయం సాధించింది. మేరికోమ్ బాక్సింగ్ ఫౌండేషన్లో శిక్షణ తీసుకున్న తింగ్మిలా డొంగల్ జూనియర్ టీమ్ విభాగంలో స్వర్ణం సాధించింది.