భారీగా పెట్రోల్ ధరలు పెరిగిపోవడానికి నిరసనగా ఇవాళ భారత్ బంద్ కొనసాగుతోంది. పెరిగిపోతున్న చమురు ధరలకు నిరసనగా కాంగ్రెస్, వామపక్షాలు భారత్ బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ రోజు బంద్ నిర్వహిస్తున్నారు. ఎక్సైజ్ సుంకం తగ్గించేందుకు కేంద్రం ముందుకు రాకపోవడం వల్లే ధరలు పెరిగిపోతున్నాయని విపక్షాలు విమర్శిస్తున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో కాంగ్రెస్, వామపక్షాల నిరసనలు కొనసాగుతున్నాయి. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలంటూ కాంగ్రెస్, వామపక్షాలు ఆందోళనలు చేపడుతున్నారు. బంద్ కారణంగా కర్ణాటక, ఒడిశా ప్రభుత్వాలు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. కాంగ్రెస్ ఇచ్చిన బంద్ పిలుపునకు మొత్తం 21 పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి. ఏపీల వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు బంద్కు మద్దతు ఇస్తున్నాయి. వామపక్షాలు, జనసేన ఆధ్వర్యంలో నాయకులు బస్టాండ్ల వద్ద శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్నారు. రాయలసీమ యూనివర్సిటీలో ఇవాళ్టి సెమిస్టర్ పరీక్షలు కూడా వాయిదా వేశారు. ఒడిశా సంబల్పూర్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో రైల్రోకో నిర్వహిస్తున్నారు. కోల్కతాలో బంద్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. బంద్తో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బస్ డిపోల ముందు వామపక్షాల నాయకులు నిరసనలు తెలుపుతున్నారు. భారత్ బంద్ కారణంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు.