అమరావతి, మార్చి 7: మహిళా సాధికారత తమ ప్రభుత్వ విధానమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నారీ లోకానికి ఆయన అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అవకాశమిస్తే అద్భుతాలు చేయగల సమర్ధత ఆధునిక మహిళల్లో ఉందని చంద్రబాబు అన్నారు. ఆమె సాహసాలనే శ్వాసించి పర్వతాలను అధిరోహించిందని, సముద్రాలనే ఈదిందని, అంతరిక్షంలోకి వెళ్లి ఖగోళ రహస్యాలను ఆవిష్కరించిందని కొనియాడారు. మహిళా సాధికారతతో ప్రపంచం రూపురేఖలే మార్చవచ్చని, నవసమాజం సృష్టించవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. స్త్రీలు పురుషులతో సమానంగా ముందుకు దూసుకెళ్లాలన్న ఉద్దేశంతోనే తాము మహిళాపార్లమెంట్ సదస్సును నిర్వహించామని తెలిపారు. దేశవ్యాప్తంగా మహిళా సాధికారతకు ఈ సదస్సు స్ఫూర్తినిచ్చిందని, చర్చకు దారితీసిందని చెప్పారు. రాజధాని లేకున్నా, ఆర్ధిక ప్రతిబంధకాలున్నా మహిళాపార్లమెంట్ సదస్సు నిర్వహించి చిత్తశుద్ధిని చాటుకున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. మగబిడ్డలతో సమానంగా ఆడబిడ్డలకు ఆస్తిహక్కు కల్పించింది తమ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీరామారావు అని, తాము గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మహిళలకు స్థానిక సంస్థలలో 33% రిజర్వేషన్లు కల్పించామని, ఇప్పుడు స్థానిక సంస్థలలో ఈ రిజర్వేషన్లను 50%కు తీసుకెళ్లామని చెప్పారు. విద్యలో, ప్రభుత్వోద్యోగాలలో 33% రిజర్వేషన్లుఅమలుచేస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. ఐదు లక్షల మంది మహిళలకు డిజిటల్ లిటరసీలో శిక్షణనిచ్చామని తెలిపారు. మహిళలు చదువుకొని ఉన్నతోద్యోగాలు చేపట్టి, ఆర్ధికంగా స్వయంపోషకత సాధించాలన్న ఉద్దేశంతో దేశంలోనే తొలిసారిగా విద్యార్ధినుల కోసం తిరుపతిలో పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారని, తాము ఆ విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకువెళుతున్నా ఇంకా అక్కడక్కడా వివక్ష కొనసాగుతోందని, సాధికారతతోనే వివక్షకు చరమగీతం పాడవచ్చన్నారు. చట్టసభలలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలని తమ పార్టీ పోరాడుతోందని చంద్రబాబు స్పష్టం చేశారు.