అమరావతి-అనంతపురం నడుమ నిర్మించ తలపెట్టిన రహదారికి నేషనల్ ఎక్స్ప్రెస్ వే హోదా దక్కింది. ఇది కేంద్రం ప్రకటించిన మూడో నేషనల్ ఎక్స్ప్రెస్ వే. దేశంలోనే అత్యంత పొడవైన ఎక్స్ప్రెస్ వే ఇదే కావడం విశేషం. ఈ విషయాలన్నీ మంగళవారం సచివాలయంలో జరిగిన రహదారులు, భవనాల శాఖ సమీక్షలో అధికారులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి వివరించారు. అమరావతి-అనంతపురం నేషనల్ ఎక్స్ప్రెస్ వే, బెంజ్ సర్కిల్ ఫ్లయ్ ఓవర్, విశాఖ-భీమిలి, భోగాపురం-భీమిలి బీచ్ రహదారుల పురోగతిని ముఖ్యమంత్రి ప్రధానంగా సమీక్షించారు. మొత్తం 393.59 కి.మీ. పొడవున అమరావతి-అనంతపురం నేషనల్ ఎక్స్ప్రెస్ వేను 4, 6 లైన్లుగా నిర్మించాలని నిర్ణయించారు. ఇందులో 185.4 కి.మీ పొడవున నాలుగు వరుసలుగా, 208.19 కి.మీ. పొడవున ఆరు వరుసలుగా నిర్మిస్తారు. సుమారు పది కి.మీ. పొడవున సొరంగ మార్గం ఏర్పాటు చేయడంతో పాటు, పెద్దఎత్తున బ్రిడ్జిలు నిర్మించాల్సి వుంటుందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ రహదారి నిర్మాణానికి రూ. 18,103 కోట్ల వ్యయం కానుందని తెలిపారు. కర్నూలు నుంచి అమరావతి-అనంతపురం నేషనల్ ఎక్స్ప్రెస్ వేను కలుపుతూ ఫీడర్ రోడ్డు నిర్మించేందుకు మూడు ప్రతిపాదనలను, కడప నుంచి అనుసంధానించేందుకు రెండు ప్రతిపాదనలను అధికారులు ముఖ్యమంత్రి ముందుంచారు. ఇందులో కర్నూలు నుంచి నన్నూరు, భాగ్యనగర్ మీదుగా 75.60 కి.మీ. పొడవున, అటు కడప నుంచి కుమ్మరకొట్టలు, ఎడవల్లి మీదుగా 88 కి.మీ. పొడవున నేషనల్ ఎక్స్ప్రెస్ వేతో కలిసేలా రూపొందించిన మార్గానికి ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు.
సుందరంగా బెంజ్ సర్కిల్ ఫ్లయ్ఓవర్: విజయవాడలోని బెంజ్ సర్కిల్ దగ్గర తలపెట్టిన ఫ్లయ్ఓవర్కు సంబంధించి డిజైన్లు పరిశీలించిన ముఖ్యమంత్రి- నగరానికి మరింత వన్నె వచ్చేలా బెంజ్ సర్కిల్ ఫ్లయ్ఓవర్ను సుందరంగా నిర్మించాలని అధికారులకు సూచించారు. ఫ్లయ్ ఓవర్ల నిర్మాణంలో అనుభవం వున్న కన్సల్టెంట్ను నియమించుకోవాలని చెప్పారు. జులై 2018 నాటికి పూర్తి చేసి, ఆగస్టులో ఎట్టి పరిస్థితుల్లో ఫ్లయ్ఓవర్ ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. విజయవాడ-మచిలీపట్నం మధ్య మొత్తం 64.6 కి.మీ పొడవున నాలుగు వరుసల్లో నిర్మిస్తున్న 9వ జాతీయ రహదారి ప్రాజెక్టుకు రూ. 740.70 కోట్లు వ్యయం కానుందని అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి చెప్పారు. మొత్తం ప్రాజెక్టులో నాలుగు మేజర్ బ్రిడ్జిలు, ఐదు మైనర్ బ్రిడ్జిలు, ఐదు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, ఇంకా కల్వర్టులు నిర్మిస్తున్నామని అన్నారు. విశాఖ-భీమిలి, భోగాపురం-భీమిలి మధ్య నిర్మించే బీచ్ రహదారులను జాతీయ రహదారితో అనుసంధానించడం ద్వారా ‘సౌందర్యమాల’ సాకారమవుతుందని ముఖ్యమంత్రి అన్నారు. బీచ్ రహదారులతో పర్యాటకరంగం వృద్ధి చెందుతుందని, సైకిల్ ట్రాక్, వాక్ వే కూడా వాటికి సమాంతరంగా అభివృద్ధి చేయాలని చెప్పారు.