తిరువనంతపురం : కేరళ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు, వరదలు రావడంతో తమ నివాసాల నుంచి పునరావాస కేంద్రాలకు ప్రజలు తరలివెళ్లిన విషయం విదితమే. వర్షాలు, వరదలు తగ్గడంతో.. మళ్లీ తిరిగి ప్రజలు తమ నివాసాలకు చేరుకుంటున్నారు. అయితే వరదలకు పలు నివాసాల్లోకి మొసళ్లు, పాములు వచ్చి చేరాయి. తమ నివాసాల్లో ఉన్న పాములు, మొసళ్లను చూసి స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. త్రిశూరు జిల్లాలోని చాలకుడి ఏరియాలో ఓ ఇంట్లో ఉన్న మొసలిని తాళ్లతో బంధించారు. మలప్పురంలో అయితే ఇప్పటి వరకు 100కు పైగా పాములను పట్టుకున్నారు. పాములు పట్టే ముస్తాఫా బిజీ అయిపోయారు. ఇండ్లలో బురద ఉండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎర్నాకులం జిల్లాలో 52 మంది పాముకాటుకు గురయ్యారు. వీరంతా చికిత్స పొందుతున్నారు. వరద ప్రభావిత జిల్లాల్లో ఆంటీ వీనం మందులను కేరళ ప్రభుత్వం సరాఫరా చేస్తుంది. ఇడుక్కి, కోజికోడ్, ఎర్నాకులం, మలప్పురం, వాయాండ్, త్రిశూర్, అలఫుజా, పాతనమతిట్ట జిల్లాలను వర్షాలు, వరదలు ముంచెత్తాయి.