దిల్లీ: వరుణుడు సృష్టించిన బీభత్సానికి దేవభూమి అయిన కేరళకు కోలుకోలేని దెబ్బ తగిలింది. పెను విపత్తుతో అల్లాడుతున్న కేరళకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇతర రాష్ట్రాలు కూడా అండగా నిలుస్తున్నాయి.తాజాగా కేంద్ర ప్రభుత్వం మరో నిర్ణయాన్ని ప్రకటించింది. ఇతర రాష్ట్రాల నుంచి కేరళ రాష్ట్రానికి పంపే వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ, జీఎస్టీని తీసివేస్తున్నట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మంగళవారం ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. దీనిపై తదుపరి నిర్ణయాన్ని జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్వహించిన తరువాత వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ నిబంధన డిసెంబర్ 31, 2018 వరకు వర్తిస్తుందని ఆయన వివరించారు.ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలను తగ్గించాల్సిందిగా కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ కేంద్ర ఆర్థిక శాఖకు లేఖ రాశారు. దీంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కేరళలో ఇప్పటికే సహాయక చర్యలు వేగవంతమయ్యాయి. దెబ్బతిన్న గ్రామాల్లో 90 శాతం ఫోన్ కనెక్టివిటీ పునరుద్దరించినట్లు అధికారులు తెలిపారు.