వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేస్తున్న ప్రజాసంకల్ప పాదయాత్ర, 242వ రోజు నేడు విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో కొనసాగుతోంది. కైలాసపట్నం శివారు నుంచి జగన్ తన యాత్రను ప్రారంభించగా, మహిళలు బారులు తీరి స్వాగతం పలికారు. ఆ ప్రాంతంలో ఓ అభిమాని తాను తయారు చేసిన ఓ బుల్లి ఫ్యాన్ ను జగన్ కు బహూకరించగా, జగన్ దాన్ని అటూ ఇటూ తిప్పి ఆసక్తిగా చూశారు. ఇది బ్యాటరీతో పనిచేస్తుందని ఆ అభిమాని జగన్ కు తెలిపాడు. కాగా, నేడు చౌడువాడ క్రాస్, గొట్టివాడ, పండూరు క్రాస్, రామచంద్రపురం క్రాస్ మీదుగా దార్లపూడి వరకూ జగన్ నడవనున్నారు. జగన్ పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది.