కాంగ్రెస్ హయాంలో జరిగిన జల దోపిడీని కడగటానికి తమకు నాలుగేళ్ల సమయం పట్టిందని శాసనమండలి చీఫ్ విప్ పయ్యావుల కేశవ్ అన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో జరుగుతున్న 36వ ప్యాకేజీ పనులు ముందుకు సాగకుండా వైకాపా ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి చేస్తున్న ప్రయత్నాలపై ఆయన మండిపడ్డారు. భూసేకరణ విషయంలో ఆలస్యమవుతున్నా, తాము రైతులను ఒప్పించి పనులు చేస్తుంటే వైకాపా నేతలు మాత్రం పనులు జరగకుండా అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. రైతులను రెచ్చగొట్టడం, కోర్టులకు వెళ్లడం చేస్తున్నారని ఆరోపించారు. రైతుల పొలాలకు నీరు ఇస్తుండటం చూసి ఒర్వలేకనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని, దీనిని ప్రజలు గమనిస్తున్నారని కేశవ్ అన్నారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా హంద్రీనీవా పనులు పూర్తి చేసి నియోజకవర్గంలో ఆయకట్టుకు నీరిందిస్తామని స్పష్టం చేశారు.