ప.గో. జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో కుండపోత వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి జల్లేరు, బయనేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెం వద్దనున్నకరాటం కృష్ణమూర్తి ఎర్రకాల్వ జలాశయం లోకి వరదనీరు భారీగా చేరుతోంది. ఇప్పటి వరకూ ఎర్రకాల్వ జలాశయం లోకి 1800 క్యూసెక్కుల వరద నీరు చేరగా.. జలాశయం నీటిమట్టం 81.5 మీటర్లకు చేరుకుంది. 83 మీటర్ల నీటిమట్టానికి చేరగానే అధికారులు జలాశయం గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉంది. అనుకున్న స్థాయికి నీటిమట్టం చేరితే గేట్లు ఎత్తివేసేందుకు ఇరిగేషన్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.