న్యూఢిల్లీ: భారతరత్న, మాజీ ప్రధాని వాజ్పేయి పార్థీవదేహానికి నివాళులర్పించేందుకు వివిధ పార్టీల నేతలు, ప్రముఖులు కృష్ణమార్గ్లోని ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. పార్థీవదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉదయం 8.30 గంటల వరకు నివాసంలో ఉంచనున్నారు. అనంతరం ఉదయం 9 గంటలకు బీజేపీ కార్యాలయానికి వాజ్పేయి పార్థీవదేహాన్ని తరలించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు వాజ్పేయి అంతిమ యాత్ర ప్రారంభం కానుంది.
సాయంత్రం 4 గంటలకు యమునా నది ఒడ్డున ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. యమునానది ఒడ్డునే రాష్ట్రీయ స్మృతి స్థల్ నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు బీజేపీ ఆఫీస్ వద్ద అంతియయాత్ర కోసం ప్రత్యేక వాహనాలను సిద్ధంగా ఉంచారు. అంతిమయాత్ర మార్గాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. వాజ్పేయి మృతికి సంతాపసూచకంగా కేంద్రప్రభుత్వం ఈ నెల 22 వరకు సంతాపదినాలుగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా వారంరోజులపాటు వినోద కార్యక్రమాలు నిలిపివేసింది. కేంద్రం నిర్ణయానికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఏడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది.