న్యూఢిల్లీ: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఆరోగ్య పరిస్థితి మళ్లీ ఆందోళనకరంగా మారింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి దిగజారడంతో వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. దీంతో కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్రనేతలు, పలు రాజకీయ పార్టీల ముఖ్యనేతలు ఆయనను పరామర్శించేందుకు ఎయిమ్స్కు బయలుదేరారు. ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న తన తండ్రి వాజ్పేయిని ఆయన దత్తపుత్రిక నమిత చూసొచ్చారు. కొన్నేళ్లుగా వాజ్పేయి బాగోగులను నమిత చూసుకుంటున్నారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర మంత్రి జేపీ నడ్డా, బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ, ఆయన కుమార్తె ప్రతిభా అద్వానీ గురువారం ఉదయమే వాజ్పేయిని పరామర్శించారు.
మరికాసేపట్లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎయిమ్స్కు వెళ్లి వాజ్పేయి ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేయనున్నారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేడు ఢిల్లీ వెళ్లి వాజ్పేయిని పరామర్శించనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. మరోవైపు ఆమ్ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఎయిమ్స్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దేశవ్యాప్తంగా వాజ్పేయి అభిమానులు, బీజేపీ కార్యకర్తలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. గ్వాలియర్లోని ప్రభుత్వ ఆయుర్వేదిక్ కాలేజ్ విద్యార్థులు వాజ్పేయి కోలుకోవాలని హోమం నిర్వహించారు.