న్యూఢిల్లీ: బీజేపీ అగ్రనేత, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి(93) ఆరోగ్యం మరింత క్షీణించింది. ఈ నేపథ్యంలోనే గురువారం ఉదయం భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఎయిమ్స్కు వెళ్లి వాజ్పేయిని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎయిమ్స్ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వెంకయ్య నాయుడు హైదరాబాద్ పర్యటనకు బయలుదేరారు. దేశ ఉపరాష్ట్రపతిగా ఎన్నికై ఏడాదికాలం దిగ్విజయంగా ముగిసిన సందర్భంగా గండిపేట మండల పరిధిలోని నార్సింగిలో నూతనంగా ప్రారంభమైన 'ఓం కన్వెన్షన్ సెంటర్'లో 'హై టీ' కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొననున్నారు.
బుధవారం రాత్రి ప్రధాని మోదీ, పలువురు కేంద్రమంత్రులు వాజ్పేయిని పరామర్శించారు. గత 24 గంటల్లో వాజ్పేయి ఆరోగ్య పరిస్థితి మరింత విషమించిందని బుధవారం రాత్రి 10.15 గంటల సమయంలో ఎయిమ్స్ ఒక ప్రకటన విడుదల చేసింది.